Jagan And KCR: గెట్టు పంచాయతీ లేదు.. గట్టు వ్యవహారం లేదు. కాకపోతే జగన్ అంటే ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు విపరీతమైన కోపం. అతడి మీద ఎందుకు ఆ స్థాయిలో కోపం వస్తుంది.. ఎందుకు అతను అంటే విరుచుకు పడిపోతారు అనే విషయాన్ని అటు ఆర్కే చెప్పడు. జగన్ వివరించలేడు. మొత్తానికి వారిద్దరి మధ్య నిత్యం రావణకాష్టం లాగా గొడవ జరుగుతూనే ఉంటుంది. జగన్ మీడియాను కూలి మీడియా అని.. నీలి మీడియా అని రాధాకృష్ణ విమర్శిస్తే.. రాధాకృష్ణ మీడియాను తోక పత్రికగా.. తోక మీడియా గా జగన్ మీడియా అభివర్ణిస్తూ ఉంటుంది.
మావిగన్ పేరుతో ఇటీవల జగన్ ఏపీ రాష్ట్రానికి కొత్త రాజధాని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీని పట్ల జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే పాత్రికేయులు కూడా పెదవి విరిచారు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయని వారు ప్రశ్నించారు. జగన్ మావిగన్ పేరును తెరపైకి తీసుకురావడంతో.. వైసిపి అనుకూల మీడియా తెగ ప్రచారం చేసింది. ఇక సోషల్ మీడియాలో అయితే జరిగిన చర్చ మామూలుది కాదు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నికలకు ముందు విశాఖపట్నం క్యాపిటల్ రాజధాని అని ప్రకటించారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. మూడు రాజధానుల ప్రతిపాదన తప్పు అని ఆ పార్టీ నాయకులు ఒప్పుకున్నారు. ఇప్పుడు అమరావతికి అటు పార్లమెంట్ ఆమోదముద్ర వేయడంతో జగన్ తెరపైకి మావిగన్ అనే పేరును తీసుకొచ్చారు. దీనివల్ల వైసిపి ఎంత విమర్శల పాలవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
జగన్ వ్యవహరించిన తీరును అందరు ఒకలా చూస్తే.. ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ మరో విధంగా చూస్తారు. సాధారణంగా తను జర్నలిస్టు. పైగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయనకు విపరీతమైన రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఇన్సైడ్ టాక్ లలో ప్రస్తావనకు వచ్చిన విషయాలను ఆయన వెలుగులోకి తీసుకొస్తారు. అందువల్లే ఆయనను దమ్మున్న జర్నలిస్ట్ అంటారు.
జగన్ మావిగన్ ప్రతిపాదన తీసుకొస్తే.. దానిని గులాబీ పార్టీ నేతలు వ్యతిరేకించారని.. అమరావతికి రాజ్యసభలో జై కొట్టారని.. తద్వారా జగన్మోహన్ రెడ్డికి.. గులాబీ పార్టీ పెద్దలు కేసీఆర్, కేటీఆర్ కు చెడిపోయిందని రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ జగన్ కు బుద్ధి రావడం లేదని రాధాకృష్ణ పేర్కొన్నారు. మావిగన్ మాత్రమే కాదు.. ఇంకా అనేక విషయాలను ఈ వారం కొత్త పలుకులో రాధాకృష్ణ ప్రస్తావించారు. అన్నింట్లోనూ జగన్మోహన్ రెడ్డిని ఉతుకుడు ఉతికారు. సర్ఫ్ ఎక్సెల్.. రిన్.. ఇలా అన్ని రిటర్జెంట్ పౌడర్లతో తలంటారు..
జగన్ అంటేనే రాధాకృష్ణకు కోపం. పైగా జగన్ చేసిన తప్పు కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇంకేముంది చెలరేగిపోయారు రాధాకృష్ణ. ఔను సార్.. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతికి నరేంద్ర మోడీతో శంకుస్థాపన చేసింది. అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది.. పాపం ఈ ప్రశ్న రాధాకృష్ణ అడగలేడు. అడిగే సాహసం చేయలేడు.