Andhra Pradesh Heatwave 2026: ఏపీలో( Andhra Pradesh) ఎండ తీవ్రత పెరుగుతోంది. వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండల తీవ్రత ఉంది. ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు కూడా ఇష్టపడడం లేదు. మున్ముందు ఎండల తీవ్రత మరింత పెరగనుందని తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.. మొన్నటివరకు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో చల్లటి వాతావరణం కొనసాగింది. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత పతాక స్థాయికి చేరింది. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 40 డిగ్రీలు అనేది సాధారణ ఉష్ణోగ్రతగా నమోదవుతున్నాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
* తీవ్రవాడగాలులు
అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు వీస్తుండడంతో ప్రజలకు అసౌకర్యం తప్పడం లేదు. వేడిగాలులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకించి రాయలసీమ ( Rayalaseema) జిల్లాల్లో వేడి గాలులు, ఉష్ణోగ్రతలు పంజా విసురుతున్నాయి. 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా గూడూరులో 41.2 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదయింది. రాష్ట్రంలో ఇదే అత్యధికం అని తెలుస్తోంది. తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయింది. ఈ రెండు జిల్లాల్లో సైతం వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది.
* కృష్ణాజిల్లా పెద్ద పారుపూడిలో 40.9, చిత్తూరు జిల్లా నగిరిలో 40.4, పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో 40.3, విజయనగరం జిల్లా గుర్లలో 40.1 డిగ్రీల మీద పగటి ఉష్ణోగ్రత నమోదయింది. పల్నాడు జిల్లా గురజాలలో 39.8, నంద్యాల జిల్లా గుల్లదుర్తి, కర్నూలు జిల్లా తోవిలో 39.7 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
* ఈరోజు రాష్ట్రంలోని 17 మండలాల్లో తీవ్ర వడగాలులు, 32 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.
* ఉదయం 10 గంటలకే రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రజలు అత్యవసరం అయితే తప్ప రహదారుల పైకి రావడం లేదు.
* వృద్ధులతో పాటు చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.