YS Jagan Hindu Image Controversy: ఆంధ్రప్రదేశ్లో 2024 అసెబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ వైఫల్యాలను ఎత్తి చూపుతోంది. మరోవైపు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి లడ్డూ కల్తీ, ఆలయాల కూల్చివేత అంశాలను కూటమి ప్రభుత్వం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. దీంతో వైసీపీ శ్రేణుల్లో భయం పెరుగుతోంది. ఈ తరుణంలో దానిని తొలగించుకునేందుకు ప్రజలు నమ్మకుండా చేసేందుకు వైసీపీ చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా తాజాగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి రెండు రోజుల క్రితం నిర్వహించిన కార్యక్రమం వేదికైంది. ఈ వేదిక నుంచి భూమన కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి వెళ్లినవారిని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారని తెలిపారు.
మత మార్పిడి కార్యక్రమం..
తిరుపతికి చెందిన శ్రీనివాస్ రెడ్డి (అబ్దుల్లా), పుష్ప (అమీనా) అనే దంపతులు 30 ఏళ్ల తర్వాత తిరిగి హిందూ మతంలోకి వచ్చారు. కువైట్లో పని నిమిత్తం ఉన్నప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఇస్లాం స్వీకరించిన ఈ దంపతులు, స్వదేశానికి వచ్చాక భూమన ప్రోత్సాహంతో సనాతన ధర్మంలోకి తిరిగొచ్చారు. ఈ కార్యక్రమాన్ని భూమన ఘనంగా నిర్వహించారు.
జగన్ వ్యూహంలోని కీలక అంశాలు..
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మతం మారినవారిపై దృష్టి సారించారని కరుణాకర్రెడ్డి తెలిపారు. టీటీడీ వేదికగా హిందూ మతంలోకి తీసుకురావాలని తనకు సూచించినట్లు వెల్లడించారు. దీంతో తాను టీటీడీ చైర్మన్గా 60 మంది పీఠాధిపతులతో సదస్సు ఏర్పాటు చేశానని వెల్లడించారు. ఇతర మతాల నుంచి హిందూ మతంలోకి వచ్చేవారికి తిరుమల వేదికగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించామని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకుని రెండేళ్లు గడుస్తున్నా, ప్రస్తుత ప్రభుత్వం దీనిని అమలు చేయకపోవడంపై భూమన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కుటుంబం క్రై స్తవ మతానికి చెందినదే అయినా, ఆయన హిందూ ధర్మ పరిరక్షణపై చూపిస్తున్న చొరవ గమనార్హం.
ఎందుకింత ఆతృత?
జగన్ ఈ నిర్ణయం వెనుక కేవలం ఆధ్యాత్మిక కారణాలే కాదు, స్పష్టమైన రాజకీయ వ్యూహం కూడా ఉంది. ప్రతిపక్షాలు జగన్ను ‘హిందూ వ్యతిరేకి‘, ‘క్రై స్తవ అజెండా‘ ఉన్న నేతగా చిత్రీకరిస్తున్నాయి. దీనికి చెక్ పెట్టడానికి ఈ చర్య మొదలు పెట్టారు. రాష్ట్రంలో 90% పైగా హిందువులు ఉన్నారు. వారి మనోభావాలను గెలిచేందుకు ఈ ప్రయత్నం. వైఎస్సార్సీపీ ఓటమి తర్వాత, పార్టీకి పట్టున్న హిందూ ఓటు బ్యాంకును తిరిగి ఆకట్టుకోవడం అత్యవసరం. భూమన కరుణాకర్ రెడ్డిపై ‘నాస్తికుడు‘, ‘క్రై స్తవుడు‘ అనే విమర్శలు ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ఆయన కూడా హిందూ ధర్మరక్షకుడిగా నిలిచారు.
జగన్ దంపతులను మార్పించరా?
భూమన కార్యక్రమంపై వివిధ వర్గాల నుంచి విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం. శ్రీనివాస్ ఓ ట్వీట్ చేశారు. ‘మీరు చేసిన కార్యక్రమం బాగుంది. అదే విధంగా మీ అధినేత జగన్ దంపతులను కూడా తిరిగి హిందూ మతంలోకి తీసుకురండి‘ అని సూచించారు. ఇదిలా ఉంటే.. భూమన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వ పదవులు నిర్వహించిన వ్యక్తి. ఆయన మతమార్పిడి కార్యక్రమాలు నిర్వహించడం సరైనదేనా అనే ప్రశ్నలు ఉన్నాయి. ఇది కేవలం ఓట్ల కోసం చేస్తున్న ప్రదర్శన మాత్రమేనని, నిజమైన ఆధ్యాత్మికత లేదని కూటమి నేతలు వాదిస్తున్నారు.
జగన్ వ్యూహం విజయవంతమవుతుందా?
హిందూ ధర్మ పరిరక్షణకు జగన్ తీసుకున్న చర్యలు (ధూపదీప నైవేద్యం, ఆలయ నిర్మాణాలు) కేవలం మాటలు కాదు, అమలులో కూడా ఉన్నాయి. మెజారిటీ హిందూ ఓటర్లను ఆకట్టుకోవడంలో ఈ వ్యూహం ఫలితాలనివ్వగలదు ‘హిందూ వ్యతిరేకి‘ ముద్రను తొలగించుకోవడానికి ఇది బలమైన ఆయుధం. అయితే జగన్ కుటుంబం క్రై స్తవ మతానికి చెందినదే కాబట్టి, కొందరు హిందువులు ఇంకా సందేహించే అవకాశం ఉంది.
జగన్ ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం ఏదైనా సరే, హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని సందేశం ఇవ్వడంలో విజయం సాధించారు. క్రై స్తవ కుటుంబ నేపథ్యం ఉండి కూడా హిందూ మత పునరుద్ధరణకు కృషి చేయడం గమనార్హం. ఇది కేవలం ఓట్ల కోసం చేస్తున్న రాజకీయ వ్యూహమా లేక నిజమైన ఆధ్యాత్మిక విశ్వాసమా అనేది కాలమే నిర్ణయించాలి.
