TTD Laddi Issue :  పాపం జగన్.. ఈ కష్టం నుంచి వైసీపీకి గట్టెక్కించేవారు లేరా

వైసిపి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. తిరుమలలో వివాదం నేపథ్యంలో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. సమస్య నుంచి బయటపడలేక సతమతమవుతోంది. ఇటువంటి కష్టకాలంలో వైసీపీని ఆదుకునేందుకు ఏ రాజకీయ మిత్రుడు కనిపించకపోవడం విశేషం.

Written By: Dharma, Updated On : September 29, 2024 10:07 am

YS Jagan

Follow us on

TTD Laddi Issue :  తిరుమల లడ్డు వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యంగా ఈ వివాదంలో వైసిపి కార్నర్ అవుతోంది. అందరివేళ్ళు వైసిపి వైపే చూపిస్తున్నాయి. వైసిపి హయాంలోనే ఈ కల్తీ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. సీఎం చంద్రబాబుతో పాటు కూటమి పార్టీలు ఇదే ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో వైసిపి ఆత్మ రక్షణలో పడింది. ఇదంతా చంద్రబాబు చేస్తున్న కుట్రగా అనుమానిస్తోంది. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులను ఆ పార్టీ ఎదుర్కొంటోంది. జగన్లో సైతం ఒక రకమైన భయం కనిపిస్తోంది. తమ హయాంలో తప్పు జరగలేదని చెప్పేందుకు ఆయన పడుతున్న వ్యధ అంతా ఇంతా కాదు. సాధారణంగా ఇటువంటి ఆరోపణలు వస్తే దర్యాప్తును కోరుతారు. ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తారు. కానీ జగన్ మాత్రం పరచు బిజెపి పెద్దలు, హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు, స్వామీజీలను గుర్తు చేసుకుంటూ విన్నపాలు చేయడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఆరోపణలు చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. ల్యాబ్ నిర్ధారించిన తర్వాతే తాను ఈ విషయం బయటపెట్టినట్లు ఆయన చెబుతున్నారు. అదే సమయంలో జగన్ సైతం సిబిఐతో కానీ.. సింగిల్ జడ్జ్ తో కానీ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. అయితే స్పష్టంగా ల్యాబ్ నిర్ధారణ జరిగిన తర్వాత కూడా ఎలాంటి ఆధారాలు చూపాలని టిడిపి కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. దర్యాప్తు కోసం అత్యున్నత సిట్ బృందాన్ని కూడా నియమించింది. ఇప్పటికే ఆ బృందం విచారణను ప్రారంభించింది. అయితే ఆ విచారణను పట్టించుకోకుండా జగన్ కేంద్ర పెద్దలతో పాటు హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులకు లేఖలు రాయడం విశేషం.

* సెల్ఫ్ గోల్
టిడిపి కూటమి ప్రభుత్వం జగన్ ను తనకు తాను సెల్ఫ్ గోల్ వేయించడంలో సక్సెస్ అయ్యింది. ఈ వివాదం నడుస్తున్న నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటనకు షెడ్యూల్ ప్రకటించారు. చంద్రబాబు పాప ప్రక్షాళన కోసం తిరుమలలో పూజలు చేస్తానని చెప్పుకొచ్చారు. అక్కడే పట్టు బిగించింది టిడిపి కూటమి ప్రభుత్వం. డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. అన్య మతస్తులు తిరుమల సందర్శనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే నన్న నిబంధనను పాటించాలని టిటిడి సూచించింది. డిక్లరేషన్ ఇస్తే తాను ఒక క్రిస్టియన్ అని.. ఇవ్వకపోతే హిందూమత వ్యతిరేకి అని ముద్ర పడే ప్రమాదం ఉందని తెలియడంతో.. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు జగన్.

* మారిన బిజెపి వైఖరి
హిందూ భావజాలం ఉన్న బిజెపి.. ఇప్పుడు జగన్ విషయంలో ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చింది. ఇప్పటికే రాజకీయంగా చంద్రబాబు యాక్టివ్ అయ్యారు. కేంద్ర పెద్దలకు అవసరంగా మారారు. ఇప్పుడు హిందుత్వ భావజాలం ఉన్న బిజెపి.. వైసీపీని దరి చేర్చుకోలేని పరిస్థితి. అదే బిజెపి ఒక అడుగు ముందుకు వేసి జగన్ పై కన్నెర్ర చేస్తే.. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో వైసీపీ అధినేతకు తెలుసు. అందుకే బిజెపి పెద్దలకు ఆగ్రహం కలుగకుండా తరచూ లేఖలు రాస్తున్నారు. ఈ వివాదంలో పెద్దన్న పాత్ర పోషించాలని కోరుతున్నారు.

* జాతీయస్థాయిలో నో హెల్ప్
లడ్డు వివాదం నేపథ్యంలో వైసీపి డిఫెన్స్ లో పడింది. ఈ వివాదంలో ఏ రాజకీయ పార్టీ కూడా వైసిపికి అండగా నిలిచే ఛాన్స్ లేదు. అదే చేస్తే హిందూ సమాజానికి దూరమవుతామన్న భయం ఆ పార్టీలకు వెంటాడుతోంది. ఇండియా కూటమి పార్టీలు సైతం స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులకు నేరుగా లేఖలు రాస్తున్నారు జగన్. ఇది ఏపీ రాజకీయాల్లో భాగమని… కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తూ లేఖలు రాస్తున్నారు. కానీ ఇప్పటికే వైసీపీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అది తిరిగి వచ్చే ఛాన్స్ లేదు. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడే మార్గం జగన్ కు తెలియడం లేదు. బయటపడేసే స్నేహితులు కూడా లేరు. పోనీ కాంగ్రెస్ బయటకు వచ్చి సాయం చేస్తాం అనుకున్న జగన్ ఇంకా బిజెపి వాసనల నుంచి బయటకు రావడం లేదు. సో ఇది జగన్ కు కష్టకాలం అన్నమాట