AP Congress: ఒట్టి బిందె కూ మోత ఎక్కువే..కాంగ్రెస్ పరిస్థితి ఇదే

1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. పార్టీ ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల కాలం లోనే ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది. అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు ప్రారంభం అయ్యాయి. 1985లో నాదెండ్ల భాస్కరరావు రూపంలో కాంగ్రెస్ పార్టీ టిడిపిని నిలువరించే ప్రయత్నం చేసింది.

Written By: Dharma, Updated On : June 26, 2024 10:09 am

AP Congress

Follow us on

AP Congress: ఆంధ్రప్రదేశ్ ను సుదీర్ఘకాలంగా పాలించింది కాంగ్రెస్ పార్టీ. కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఆ పరిస్థితి మారింది. టిడిపి హవా ముందు కాంగ్రెస్ నిలవలేకపోయింది. టిడిపి ఏర్పడిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి రాగలిగింది. దేశంలోనే తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీలకు దిక్సూచిగా నిలిచింది. అయితే అదే తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించింది కాంగ్రెస్ పార్టీ. కానీ రాష్ట్ర విభజన పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో సోది లేకుండా పోయింది. కనీసం ఉనికి చాటుకోలేకపోతోంది. ఈ ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల ద్వారా బలపడాలని భావించింది. కానీ బలం పెంచుకోలేకపోయింది. వైసిపి పతనంతో బలపడాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశలు నీరుగారిపోయాయి. వైసిపి పతనం వరకు ఓకే కానీ.. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఉనికి మాత్రం చాటుకోలేకపోయింది.

1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. పార్టీ ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల కాలం లోనే ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది. అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు ప్రారంభం అయ్యాయి. 1985లో నాదెండ్ల భాస్కరరావు రూపంలో కాంగ్రెస్ పార్టీ టిడిపిని నిలువరించే ప్రయత్నం చేసింది. కానీ నందమూరి తారక రామారావు ప్రజాభిప్రాయాన్ని కోరుతూ ఎన్నికలకు వెళ్లారు. అంతులేని ప్రజామోదంతో అధికారంలోకి రాగలిగారు. కానీ 1989 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి గురికాక తప్పలేదు. అయితే 1994 ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. 1995లో టిడిపిలో సంక్షోభం ఎదురైనా.. 1995 ఎన్నికల్లో చంద్రబాబు సర్కార్ విజయం సాధించింది. 2004లో రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 2009 ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి చుక్కెదురు అయ్యింది.

రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో వైసీపీ ఆవిర్భవించింది. కాంగ్రెస్ పార్టీ స్థానంలో ఉనికి చాటుకునే ప్రయత్నం చేసింది. 2014లో ప్రతిపక్షం స్థానానికి పరిమితమైన వైసీపీ.. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఐదేళ్లపాటు అధికారాన్ని చక్కబెట్టింది. కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి తొక్కింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసిపి నీడన ఉన్న రాజశేఖర్ రెడ్డి కుమార్తె కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధికార పార్టీగా ఉన్న వైసీపీకి ఎదురెళ్లి వెళ్లారు. సోదరుడు జగన్ నాయకత్వాన్ని సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున బలమైన అభ్యర్థులను బరిలో దించడం ద్వారా వైసీపీని నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ ఆ పార్టీ సాధించిన ఓట్లు అంతంత మాత్రమే. మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు సీట్లు సాధిస్తుందని చెప్పినా.. ఓట్లు, సీట్లు పరంగా ఆ పార్టీ సాధించినవి అంతంత మాత్రమే. 40% ఓట్లు సాధించిన వైసీపీతో సవాల్ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఐదు శాతం మించి ఓట్లు రాలేదు. కానీ వైసీపీని గద్దెదించామన్న సంతోషంతో కాంగ్రెస్ పార్టీ గడిపేస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చేందుకు షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎంతగానో దోహద పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆ పార్టీకి దక్కిన ఓట్లు మాత్రం అంతంత మాత్రమే. కేవలం వైసీపీ ఓటమితో తాము బలపడం అన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉండడం విశేషం.