TDP Hybrid Mahanadu: జాతీయస్థాయిలో ఇప్పుడు చర్చకు దారితీస్తోంది తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ మహానాడు. లక్షలాది మందిని ఒకే చోటకు చేర్చేది మహానాడు. కానీ ఇప్పుడు సరిహద్దులు అనేవి లేకుండా.. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మందిని కలిపింది హైబ్రిడ్ మహానాడు. రాజకీయ సభల నిర్వహణ కష్టతరం అవుతున్న తరుణంలో.. టిడిపి సరికొత్త మార్గాన్ని చూపింది రాజకీయ పార్టీలకు. ఇంధన సంక్షోభంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదురైన వేళ.. ఒక రాజకీయ మహాసభను ఎలా నిర్వహించాలో చేసి చూపించింది తెలుగుదేశం. ఇది నిజంగా గొప్ప విషయం. జాతీయస్థాయిలో మిగతా రాజకీయ పార్టీలకు ఆదర్శం కూడా. పశ్చిమ ఆసియా పరిణామాల క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును.. ఇలా పాటించి హైబ్రిడ్ మహానాడు నిర్వహించి సక్సెస్ చేశారు చంద్రబాబు, లోకేష్.
* ఒకేసారి 20 లక్షల మంది..
సాధారణంగా మహానాడు అంటే ఏదో ఒక జిల్లాలో కానీ.. నగరంలో కానీ నిర్వహించడం ఆనవాయితీగా వచ్చేది. ఓ మూడు లక్షల మంది వరకు ఒక చోటకు చేరడం అనేది రికార్డ్. కానీ వాహనాలు ఖర్చు, ఆతిథ్యం తో పాటు భోజన ఖర్చు భారీగా ఉండేది. అయితే ఇప్పుడు హైబ్రిడ్ మహానాడు ద్వారా 20 లక్షల మంది టిడిపి శ్రేణులు కలిపారు. సొంత గ్రామంలో ఉండి టిడిపి నాయకత్వం ఆదేశాలతో పాటు నేతల దిశ నిర్దేశం పొందారు. మహానాడులో పాల్గొన్న అనుభూతిని సొంతం చేసుకున్నారు. అప్పట్లో గ్రామంలో పరిమిత సంఖ్యలోనే టిడిపి శ్రేణులు హాజరయ్యేవి. ఇప్పుడు మాత్రం టిడిపి సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరూ హాజరయ్యేందుకు ప్రయత్నం చేశారు.
* వరుస విపత్తుల వేళ..
దేశం ఒక విపత్తు నుంచి మరో విపత్తును ఎదుర్కొంటూ వస్తోంది. ఇటువంటి సమయంలో సంక్షోభాలను అధిగమించి ప్రయాణించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంధన సంక్షోభ సమయంలో తెలుగుదేశం పార్టీ పాటించిన పొదుపు మంత్రం జాతీయస్థాయిలో సైతం ఆకట్టుకుంటుంది. అయితే ఈ హైబ్రిడ్ మహానాడు వెనుక లోకేష్ ఆలోచనలు ఉన్నాయని.. నేషనల్ మీడియాలో సైతం బలమైన చర్చ నడుస్తోంది. మొన్ననే పార్టీ కార్యనిర్వాహక బాధ్యతలను తీసుకున్నారు లోకేష్. ఇంతలోనే హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహించి అబ్బురపరిచారు. గతంలో అంతర్జాతీయ యోగా డేను విశాఖ వేదికగా నిర్వహించి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు అందుకున్నారు. అప్పటినుంచి లోకేష్ నాయకత్వం పై మోడీకి గురి ఏర్పడింది. ఇప్పుడు అదే ప్రధాని ఇచ్చిన పిలుపుతో మహానాడు ను హైబ్రిడ్ విధానంలో నిర్వహించి అందరి మన్ననలు అందుకుంటున్నారు లోకేష్.
