High Temperatures in AP : తెలుగు రాష్ట్రాల్లో( Telugu States ) భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎండలు మండుతుండగా.. ఇంకోవైపు వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో వర్షాలు పడ్డాయి. అయితే అవి మందగించడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. తిరిగి ఉష్ణోగ్రతలు ప్రతాపం చూపుతున్నాయి. అయితే మేలో ఎండలు కంటే వర్షాలే అధికంగా పడ్డాయి. కానీ ఇప్పుడు వర్షాలు తగ్గి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు మండుతున్నాయి. కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలకు ఉష్ణతాపం తప్పడం లేదు. ఉదయం 8 గంటల నుంచి భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మధ్యాహ్నం కి సెగలు కక్కుతున్నాడు. సాయంత్రం వరకు ఉక్కపోత అధికంగా ఉంటోంది. వృద్ధులు, చిన్నారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
* ముందుగానే తాకిన రుతుపవనాలు..
సాధారణంగా జూన్ మొదటి వారంలో( June first week ) నైరుతి రుతుపవనాలు దేశంలో ప్రవేశిస్తాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఎనిమిది రోజులు ముందుగానే ప్రవేశించాయి. తెలుగు రాష్ట్రాలకు సైతం వారం రోజులు ముందునే తాకాయి. అదే వేగంతో విస్తరించాయి. నైరుతి ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా వర్షాల ప్రభావం ఉండడంతో ఇక వేసవి ఉండదని అంతా భావించారు. కానీ గత నాలుగు రోజులుగా భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం సాయంత్రానికి పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుండడం విశేషం.
Also Read : ఏపీలో ఆ జిల్లాలకు తీవ్ర హెచ్చరిక!
* కొద్ది రోజులపాటు వేడి..
మరి కొద్ది రోజులపాటు ఈ వేడి వాతావరణం( highly temperatures ) కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కోస్తాలో ఇదే పరిస్థితి కొద్దిరోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. కొన్నిచోట్ల 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి రుతుపవనాలు విస్తరించేటప్పుడు మధ్యలో విరామం సర్వసాధారణమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 10 తరువాత బంగాళాఖాతంలో రుతుపవనాల కదలికకు అణువుగా వాతావరణం ఏర్పడుతుందని చెబుతున్నారు. 12 నుంచి రుతుపవనాల్లో మళ్ళీ కదలిక రావచ్చని అంచనా వేస్తున్నారు. బుధవారం కోస్తా జిల్లాల్లో గరిష్టంగా 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. మరోవైపు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెబుతోంది.
* 16 సంవత్సరాల తర్వాత..
అయితే పదహారేళ్ల తరువాత రుతుపవనాలు దేశానికి ముందుగానే తాకాయి. చాలా వేగంగా విస్తరించాయి. 2009లో ఇదే మాదిరిగా రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. ఆ ఏడాది విస్తారంగా వర్షాలు పడ్డాయి. అయితే దేశంలో వర్షాలు ఎక్కువగా పడడానికి దోహదం చేసేది మాత్రం నైరుతి రుతుపవనాలు. అవి విస్తరిస్తేనే తుఫాన్లు, అల్పపీడనాలు, ఆవర్తనాలు ఏర్పడడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడం, వేగంగా స్పందించడంతో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది.