Bharati Cement Scam: ఏపీలో( Andhra Pradesh) ఇప్పుడు నెయ్యి కల్తీ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అయితే పూర్తిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఆత్మరక్షణలో పడింది. ఎదురుదాడికి దిగిన క్రమంలో అంబటి రాంబాబు ఎపిసోడ్ నడిచింది. నడిరోడ్డుపై సాక్షాత్ ముఖ్యమంత్రిని తిట్టడం అనేది సభ్య సమాజం హర్షించదు. అయితే రాజకీయాల్లో ఎదురుదాడి అనేది ముఖ్యం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఆత్మ రక్షణకు గాను ఇప్పుడు హెరిటేజ్ ను తెరపైకి తెచ్చింది. సాధారణంగా డైరీలు తమ ఉత్పత్తులను పెంచుకునేందుకుగాను.. ఇతర సంస్థలపై ఆధారపడతాయి. అలా ప్రముఖ డైరీ లన్ని ఇందాపూర్ డైరీ నుంచి కొన్ని ఉత్పత్తులు పొందుతాయి. ఈ క్రమంలో హెరిటేజ్ కూడా ఆ జాబితాలో ఉంది. అయితే ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్ సంస్థది అంటూ ప్రచారం మొదలుపెట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. శాసనమండలిలో దీనిపై చర్చకు పట్టు పట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ డిమాండ్ వచ్చిన మరుక్షణం శాసనసభలో చర్చకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. అయితే హెరిటేజ్ పై క్లారిటీ ఇస్తూనే.. వైసిపి హయాంలో భారతి సిమెంట్స్ వ్యవహారాన్ని బయటపెట్టేశారు సీఎం చంద్రబాబు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకటి అనుకుంటే.. ఇప్పుడు మరొకటి బయటపడినట్లు అయింది.
* పూర్తి ఆధారాలతో..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని రకాల నిర్మాణాల్లో భారతి సిమెంట్స్ వాడారు అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. హెరిటేజ్ పై చర్చించే క్రమంలో సీఎం చంద్రబాబు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ శాఖల్లో ఎప్పుడూ హెరిటేజ్ ఉత్పత్తులను వాడలేదని తేల్చి చెప్పారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ నిర్మాణాల్లో భారతి సిమెంట్స్ వాడారని చెప్పుకొచ్చారు. అయితే ఇది ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. వైసిపి ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాలను, రైతు భరోసా కేంద్రాలను నిర్మించారు. జగనన్న కాలనీల పేరుట గృహ నిర్మాణం చేపట్టారు. మరికొన్ని ప్రభుత్వ నిర్మాణాలు కూడా జరిగాయి. అయితే వీటి పనుల కోసం సిమెంట్ కొనేటప్పుడు తక్కువ ధర కోట్ చేసిన సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన అధికార బలంతో మార్కెట్ ధర కంటే ఎక్కువ రేటుకు తన సొంత కంపెనీ దగ్గరే సిమెంట్ కొనేలా ఒప్పందాలు చేసుకున్నట్లు ఆధారాలు బయట పెట్టింది కూటమి ప్రభుత్వం. తద్వారా అప్పటి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడటమే కాకుండా.. ఇతర సిమెంట్ కంపెనీలకు అన్యాయం జరిగిందనే వాదనను తెరపైకి తెస్తున్నారు టిడిపి నాయకులు.
* ప్రభుత్వ నిర్మాణాల్లో..
వైసిపి హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలో భారతి సిమెంట్స్( Bharati Cement) వాటా ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసినట్లు ఇప్పుడు బయటపడింది. మిగిలిన సిమెంట్ కంపెనీల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చి.. తన సంస్థ వృద్ధిరేటును పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రవృద్ది రేటు కంటే తన సొంత కంపెనీ ఆస్తులు ఎలా పెరగాలనే దానిపై జగన్ దృష్టి పెట్టారని ప్రజల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు ఈ కంపెనీకి సంబంధించిన సున్నపు గనుల లీజు వ్యవహారంలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో.. వాటిపై కూడా ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టింది. ఆ లీజులను రద్దు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అధికారులు రికార్డులను పూర్తిగా పరిశీలిస్తున్నారు.
* మద్యం కుంభకోణంతో..
మద్యం కుంభకోణం లింకులు కూడా భారతి సిమెంట్స్ కు ఉన్నాయి. ఆ కంపెనీ డైరెక్టర్ గా ఉన్న బాలాజీ గోవిందప్ప మద్యం కుంభకోణంలో అరెస్టు అయ్యారు. కేవలం హెరిటేజ్ పై అవినీతి మరక అంటించేందుకు జగన్ ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా భారతి సిమెంట్స్ అవినీతి పుట్ట తవ్వేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమయింది. ఇప్పటికే వేట ప్రారంభించింది. నెయ్యి కల్తీ ఎపిసోడ్ ఒకవైపు ఉంటూనే.. భారతి సిమెంట్ ఎపిసోడ్ మొదలుకానుంది అన్నమాట.