Heritage Foods: నెయ్యి కల్తీ వ్యవహారంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి( YSR Congress party) భారీ డామేజ్ జరిగింది. వైసిపి హయాంలో నెయ్యి కల్తీ జరిగినట్లు ఆరోపణలు, ఆధారాలు స్పష్టమయ్యాయి. అయితే ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా నెయ్యి కల్తీ వ్యవహారాన్ని హెరిటేజ్ సంస్థకు అంటగట్టేందుకు కొత్త ప్రచారం మొదలు పెట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. దాని అనుబంధ మీడియా. గత కొద్ది రోజులుగా సాక్షిలో పతాక శీర్షికన కథనాలు వస్తున్నాయి. అయితే దీనిని ఖండించింది హెరిటేజ్ సంస్థ. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు హెరిటేజ్ సంస్థ పై ఆరోపణలు చేయడాన్ని గుర్తుచేస్తూ ప్రత్యేక ప్రకటనలను సైతం విడుదల చేసింది.
*:సాక్షిలో కథనం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధ పత్రిక సాక్షి ఉంది. అయితే రాజకీయ ప్రత్యర్థులపై కథనాలు రాసేటప్పుడు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది సాక్షి. ఆ మీడియాలో వచ్చే కథనాలు అద్భుత కల్పన అని ఎక్కువమంది అభిప్రాయపడుతుంటారు. అయితే ఒక రాజకీయ పార్టీ.. రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఆ మీడియాను ఏర్పాటు చేయడాన్ని ప్రజలు కూడా గుర్తించారు. ప్రస్తుతం కల్తీ నెయ్యి వ్యవహారం కలకలం సృష్టిస్తున్న తరుణంలో.. హెరిటేజ్ పై బురదజల్లే ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా ఇండాపూర్ డెయిరీ, హెరిటేజ్ ఫుడ్స్ మధ్య సంబంధాలపై సోషల్ మీడియాలో అనేక రకాల ఆరోపణలు చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇండాపూర్ డైరీ కి టిటిడి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇప్పించేందుకు ఈ ఎత్తుగడ వేస్తున్నారు అన్నది సాక్షి మీడియాలో వచ్చిన కథనం. కానీ ఇది ఎంత మాత్రం నమ్మదగినది కాదు. ఎందుకంటే ఇండాపూర్ డైరీ అనేది మహారాష్ట్రలో ఉన్న ఒక ప్రైవేటు డైరీ.
* హెరిటేజ్ ప్రత్యేక ప్రకటన..
సాధారణంగా డైరీలు పరస్పరం కొన్ని పదార్థాలను, ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటాయి. అలాగే ఇండాపూర్ డైరీ నుంచి చీజ్, యుహెచ్డీ పాలు, ఎస్ఎంపీ, పన్నీరు వంటి కొన్ని ఉత్పత్తుల విషయంలో కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే జరుగుతోంది. సాధారణ వ్యాపార ప్రక్రియలో ఇది ఒక భాగము. తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా విషయంలో ఇంతవరకు హెరిటేజ్ కలుగజేసుకోలేదు. ఇండాపూర్ డైరీ తో నెయ్యి సరఫరాకు సంబంధించి హెరిటేజ్ ఎటువంటి ఒప్పందం కూడా చేసుకోలేదు. టిటిడి నెయ్యి సరఫరాకు సంబంధించి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నడూ కలుగజేసుకోలేదని.. అసలు సంబంధం లేని అంశాన్ని రాజకీయ ప్రేరేపితంతో అంటగట్టే ప్రయత్నం చేశారని హెరిటేజ్ సంస్థ చెప్పింది. హెరిటేజ్ ఫుడ్స్ ఇండాపూర్ డైరీ నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసే సంస్థ మాత్రమేనని.. తమ ఉత్పత్తులను ఇండాపూర్ కు అమ్మే సంస్థ కాదని పేర్కొంది. అయితే కేవలం ఆధారాలు తో సంబంధం లేకుండా సాక్షి మీడియాతో ఈ తరహా కథనం వచ్చింది. అయితే సామాజిక బాధ్యత కలిగిన ఒక పత్రికగా ఈ విషయాన్ని ముందే ప్రచురించి ఉంటే బాగుండేది. నెయ్యి కల్తీ వ్యవహారం మరింత వివాదం అయిన తరుణంలో ఈ కథనం కల్పితమని తేలిపోయింది