Amaravati development updates: అమరావతి రాజధాని నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. 2028 నాటికి తొలి దశ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉంది ప్రభుత్వం. ఒక రూపం తీసుకువచ్చి ఎన్నికలకు వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఓటమి వచ్చిన తర్వాత అమరావతి పునర్నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. అమరావతిని ప్రపంచ నగరాల్లో ఒకటిగా నిలపాలన్నది చంద్రబాబు ఆలోచన. ఆ వ్యూహానికి తగ్గట్టు పనులు జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు రాష్ట్రస్థాయిలోనే అమరావతిపై చర్చ జరిగేది. కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో సైతం అమరావతిపై చర్చ జరుగుతోంది. దేశంలోని ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, జర్నలిస్టులు ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో జాతీయస్థాయిలో విస్తృత ప్రచారం జరుగుతోంది అమరావతిపై.
అమరావతి చుట్టూ అనుకూల కథనాలు
అమరావతి నిర్మాణంలో సాంకేతిక అంశాలను జోడిస్తోంది ప్రభుత్వం. ప్రధానంగా గ్రిడ్ తరహా డిజైన్, కృష్ణానది తీరాన అభివృద్ధి చెందుతున్న జోనల్ సిస్టం ఇప్పుడు ప్రచారంలోకి వస్తోంది. ప్రముఖ యూట్యూబర్ రాజన్ సింగ్ అమరావతి పనులపై రూపొందించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. దేశ ప్రజలను ఆకర్షిస్తోంది. కేవలం సంక్షేమ పథకాలు కాదు.. శాశ్వతమైన మౌలిక సదుపాయాల కల్పన ప్రాధాన్యతను అమరావతి నిరూపిస్తోందని ఈ వీడియో చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ఏపీలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే.. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా అమరావతిని రూపుదిద్దుతున్నారు. ఇప్పటికే ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు, ప్రపంచ స్థాయి విద్యాసంస్థల క్యాంపస్లు అమరావతిలో నెలకొల్పుతున్నారు. ఇదే విషయాన్ని చెబుతున్నారు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు.
ఎండలను సైతం లెక్క చేయకుండా..
ప్రస్తుతం ఎండలకు తీవ్రత అధికంగా ఉంది. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ ఎండల్లో సైతం అమరావతి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు ఎండలను కూడా లెక్క చేయకుండా జాతీయస్థాయి ఇన్ఫ్లుయెన్సర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి.. అక్కడ జరుగుతున్న అద్భుతమైన మౌలిక వసతుల కల్పనను రికార్డ్ చేస్తున్నారు. అత్యాధునిక రవాణా సౌకర్యాలు, విశాలమైన రహదారులు, పక్కాగా విభజించిన నివాస, వాణిజ్య జోన్లను చూసి ఇండియాలోనే అద్భుత నగరం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. రాబోయే తరాలకు ఒక ఆదర్శప్రాయమైన మాడల్ అవుతుందని ఎక్కువమంది కామెంట్స్ చేస్తున్నారు. జాతీయ మీడియాలో సైతం ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. తద్వారా అమరావతిలో పెట్టుబడులు పెడుతున్న ప్రైవేటు సంస్థలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.