Google data center connectivity: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖలో గూగుల్ డేటా సెంటర్ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రారంభించారు. ఇది నగర చరిత్రలో ఒక ‘‘నూతన అధ్యాయం’’గా మారింది. ఈ ప్రాజెక్టుతో విశాఖ కేవలం తూర్పు తీరపు నగరం కాకుండా, అంతర్జాతీయ టెక్ మ్యాప్లో స్థిరమైన స్థానాన్ని పొందే దిశగా అడుగు పడింది. ఐటీ, ఏఐ హబ్గా మారడంతో నగరం అంతర్జాతీయ డిజిటల్ సరఫరాలో కీలక పాత్ర పోషించబోతోంది.
గ్లోబల్ టెక్ నెట్వర్క్లో చోటు
ఇప్పటికే ముంబై, చెన్నై వంటి పెద్ద నగరాలకు పరిమితంగా ఉన్న డేటా సెంటర్లు ఇప్పుడు విశాఖకు వచ్చి చేరడం ఒక మైలురాయిగా చూడవచ్చు. ఇక్కడ ఏర్పాటైన ఏఐ డేటా సెంటర్ ద్వారా రూపొందే 1 గిగావాట్ హైపర్స్కేల్ సౌకర్యం భారతదేశ డిజిటల్ మార్కెట్కు ఒక పెద్ద ముందడుగు వేస్తుంది. విశాఖ ఇక భారతదేశ డిజిటల్ గేట్వేగా మారుతోంది; అంతర్జాతీయ వినియోగదారులకు, పరిశోధకులకు ఈ నగరం ఒక ముఖ్య హబ్గా మారనుంది.
డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేగవంతం
ప్రపంచ స్థాయి డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెద్ద మార్పు జరుగుతోంది. ఇది కేవలం సర్వర్లు, కేబుళ్లు కాదు, వేగవంతమైన ఇంటర్నెట్, స్థిరమైన క్లౌడ్ సేవలు, సైబర్ సెక్యూరిటీ ఇంఫ్రాస్ట్రక్చర్ల అభివృద్ధిని కూడా తీసుకువస్తుంది. ఏఐ సేవలు ప్రారంభమైతే వ్యాపారాలు, పరిశ్రమలు, ప్రభుత్వ సేవలు అన్నీ డిజిటల్గా మారే అవకాశం ఉంది.
నగర రూపురేఖలు మారే సూచనలు
విశాఖ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వేగంగా ఎదిగిన నగరం. ఇప్పుడు విభజించిన రాష్ట్రంలో అతిపెద్ద, అత్యంత ప్రముఖ నగరంగా మారింది. గూగుల్ డేటా సెంటర్తోపాటు, భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం, రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వంటి పెద్ద ప్రాజెక్టులు నగర ఆర్థిక, సాంకేతిక స్థితిని మార్చివేయబోతున్నాయి. కొద్ది సంవత్సరాల్లో విశాఖ మధ్యతరగతి నగరం నుంచి ప్రపంచ స్థాయి డిజిటల్ హబ్గా మారే దిశ కనిపిస్తోంది.
ఉపాధి, పరిశ్రమ వృద్ధి అవకాశాలు
మరో రెండేళ్లలోనే విశాఖలో డేటా సెంటర్ పూర్తిగా పనిచేయడం ప్రారంభమవుతుంది. అదే సమయంలో అనకాపల్లి జిల్లాలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ మొదటి దశ, రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాజెక్టులు నేరుగా, పరోక్షంగా లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తాయి. విశాఖ ఉపాధి, పెట్టుబడి, పరిశ్రమలకు కేంద్ర స్థానంగా మారే అవకాశం బలంగా ఉంది.
ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజమైన గూగుల్ స్థాపనతో విశాఖ పేరు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందుతోంది. కేరాఫ్ గూగుల్ గా నగరం పేరు మారుతుందని అంచనా. ఈ మార్పులు కేవలం పరిశ్రమ, ఉద్యోగ సృష్టికి మాత్రమే కాకుండా, నగర ప్రజల జీవన ప్రమాణం, నైపుణ్యాలు, సాంస్కృతిక గుర్తింపులను కూడా మార్చబోతున్నాయి. విశాఖ ఇక కేవలం సాగర తీర నగరం కాకుండా, డిజిటల్, సాంకేతిక పురోభివృద్ధికి ప్రతీకగా మారబోతోంది.
