Former Vice President Venkaiah Naidu: ఏపీలో( Andhra Pradesh) ఉచిత పథకాలపై వ్యాఖ్యలు చేశారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఉచిత పథకాలతో రాష్ట్రాలకు ఇబ్బందికరమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే అది మంచిదే అయినా ఉచిత పథకాలు లేకుండా ప్రజలను ఆకర్షించడం చాలా కష్టం. వైయస్సార్ కాంగ్రెస్ సర్కారు సంక్షేమ పథకాలు అమలు చేసింది. దానిని దెబ్బతీయాలంటే రెట్టింపు పథకాలు అవసరం అని భావించి చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజలు దానికి హర్షించి కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు దానికి మించి పథకాలు ఇవ్వాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పై. అలా హామీలు ఇస్తేనే ప్రజలు టర్న్ అయ్యేది. అంటే ప్రజలకు సంతృప్తి పరచడం అనేది ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఒక భాగం. వారు సంతృప్తి పడితే కానీ ఓట్లు రాలవు. సీట్లు రావు. అయితే ఇది వెంకయ్య నాయుడు లాంటి సీనియర్ నేతకు తెలియంది కాదు. కానీ రోజురోజుకు పెరుగుతున్న సంక్షేమ పథకాలు, ఉచితాలతో రాష్ట్రం పతనం అంచున నిలబడుతుంది అన్నది ఆయన వాదన. ఆయన వాదనతో ఏకీభవించవచ్చు కానీ అంత సాహసం మన రాజకీయ పార్టీలు చేయవు. ఎందుకంటే వారికి కావాల్సినవి ఓట్లు, సీట్లు. ఓట్ల రాజకీయంలో మునిగిపోయి ఉచిత పథకాలు రాజ్యమేలుతున్నాయి.
మితిమీరిన పథకాలు..
అప్పట్లో సంక్షేమం( welfare) అంటే కడుపునిండా భోజనం, వైద్యం, విద్య మాత్రమే. ఇప్పుడైతే వాటికి తోడు నిత్యజీవితంలో భాగమైన అన్ని ఉచితంగా ఇవ్వాల్సిందే. ప్రజలకు రాని ఆలోచనలు కూడా రాజకీయ పార్టీలు వారి ముందు ఉంచుతాయి. అయితే ఆశపడడం మనిషి నైజం. అందుకే ఎక్కువమంది ఉచిత పథకాలకు టర్న్ అవుతారు. అధికారాన్ని కట్టబెడతారు. అయితే ప్రజలు అడగరు. ఆశిస్తారు కానీ ఇవ్వాలని డిమాండ్ చేయరు. కానీ పథకాలు ఇచ్చి ఓట్లు రాబెట్టుకుంటాయి రాజకీయ పార్టీలు. ఈ క్రమంలో వారి మధ్య పోటీ ఈ ఉచితాలు పెరగడానికి కారణం. అయితే దీనికి బ్రేక్ చెబితే ప్రజలు ఎలా టర్న్ అవుతారో అని ఆందోళన ఉంటుంది అధికార పార్టీకి. హామీలు ఇచ్చారు కదా ఎందుకు అమలు చేయరని అడుగుతాయి విపక్షాలు. మళ్లీ అవే విపక్షాలు దుబారా ఖర్చులు అంటూ.. ఈ రాష్ట్రానికి ప్రమాదం అంటూ హెచ్చరిస్తాయి. ఈ విషయంలో మీడియాలు సైతం తమ ప్రాధాన్యతను ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. వ్యతిరేకించిన మీడియా తర్వాత అనుకూలంగా మాట్లాడుతుంది. అనుకూల కథనాలు ఇచ్చే మీడియా తర్వాత వ్యతిరేకం అవుతుంది.
అభివృద్ధితో పాటు సంక్షేమం..
పోనీ సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా అని అధికారాన్ని కట్టబెడతారా? అంటే అదీ లేదు. మొన్నటి జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )అంతులేని సంక్షేమ పథకాలు ఇచ్చానని చెప్పారు. కానీ అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కోరుకున్నారు ప్రజలు. కూటమికి జై కొట్టి ఆ సంకేతాలను ఇచ్చారు. అంటే ఈ రాష్ట్రానికి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ముఖ్యమని చెప్పారు. ఇప్పుడు దానినే ఆచరిస్తున్నారు చంద్రబాబు. తొలి ఏడాది కేవలం పాలనపై దృష్టి పెట్టి నిధుల సమీకరణ పై ఫోకస్ పెట్టారు. అవి కొలిక్కి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేయడం ప్రారంభించారు. అయితే ప్రజలకు సూపర్ సిక్స్ పథకాల రూపంలో హామీలు ఇచ్చారు కాబట్టి అమలు చేయాల్సి ఉంటుంది. అమలు చేయకపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అమలు చేస్తుంటే ఇది సరికాదు అని వెంకయ్య నాయుడు లాంటి వారు చెబుతున్నారు. రాజకీయాల్లో ఇప్పుడు ఉచితాలు సర్వసాధారణం అయ్యాయి. వాటిని అమలు చేస్తే ఒక చింత. అమలు చేయకపోతే మరో చింత అన్నట్టు ఉంది పరిస్థితి. ఇక తేల్చుకోవాల్సింది రాజకీయ పార్టీలే. కానీ వాటికి రాజకీయ లబ్ధి తప్పితే మరో ప్రయోజనం ఏముంటుంది చెప్పండి. ఇప్పటివరకు యధా రాజా తథా ప్రజా. కానీ ఇప్పుడు యధా ప్రజ తథారాజ అన్నట్టు ఉంది పరిస్థితి.