AP New Districts : ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయా? మరో నాలుగు జిల్లాలు అదనంగా రానున్నాయా? ఇప్పుడు ఉన్న వాటిలోకొన్నింటిని రద్దు చేయనున్నారా?ఏపీవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది.సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.13 ఉమ్మడి జిల్లాలను రెట్టింపు చేస్తూ 26 గా మార్చారు.పాలన వికేంద్రీకరణ పేరుతో ఈ జిల్లాల ఏర్పాటు సాగింది. అయితే జిల్లాల విభజనలో హేతుబద్ధత పాటించలేదన్న విమర్శ వైసిపి ప్రభుత్వం పై ఉంది. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికగా ఈ జిల్లాల విభజన సాగింది. అయితే కనీస నిబంధనలు పాటించలేదన్న విమర్శ జగన్ సర్కార్ పై పడింది. అందుకే ఈ ఎన్నికల్లో మైనస్ కు కారణం అదేనని తెలుస్తోంది. జిల్లాలను విభజించిన అందుకు తగ్గట్టు మౌలిక వసతులు కల్పించలేదు. చిన్నపాటి కార్యాలయాలనే కలెక్టరేట్లుగా మార్చారు.అధికారులు,ఉద్యోగులు, సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించలేదు.అది పాలనపై స్పష్టమైన ప్రభావం చూపింది.ప్రజా వ్యతిరేకతకు కారణమైంది.అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక మార్పులు చేస్తూ ముందుకెళ్తోంది.ఈ తరుణంలో జిల్లాల ఏర్పాటు పై దృష్టి పెట్టినట్లు వార్తలు వచ్చాయి.సోషల్ మీడియాలో కొత్త జిల్లాలు ఇవి అంటూ తెగ ప్రచారం నడిచింది.ఇప్పుడు అదే వైరల్ అంశం గా మారిపోయింది.
* అనకాపల్లి జిల్లా రద్దు
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోంది. ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకు సాగుతోంది చంద్రబాబు సర్కార్. ఈ తరుణంలో జిల్లాల విభజనపై దృష్టి పెట్టినట్లు ప్రచారం ప్రారంభమైంది. కొన్ని జిల్లాలను రద్దు చేస్తూ.. అదనంగా మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేస్తారని టాక్ నడుస్తోంది. రద్దయ్యే జిల్లాల జాబితాలో అనకాపల్లి ఉంది. దీంతో అక్కడి నేతల్లో ఒక రకమైన కలవరం కనిపిస్తోంది. కొత్తగా ఐదు జిల్లాలను ఏర్పాటు చేస్తారని.. ఉన్న రెండు జిల్లాలను రద్దు చేస్తారని అనుమానాలు ప్రారంభమయ్యాయి.
* ఆ నాలుగు పేరిట కొత్త జిల్లాలు
కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాల్లో అమరావతి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. రాజధాని నగరాన్ని జిల్లాగా ప్రకటించకపోవడం ఏంటన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇంకోవైపు మదనపల్లె, మార్కాపురం, హిందూపురం, ఆదోని ని కొత్త జిల్లాలుగా ప్రకటిస్తారని తెగ ప్రచారం నడుస్తోంది. అయితే ఈ ప్రచారం పతాక స్థాయికి చేరడంతో ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు సోషల్ మీడియాలో ఈ ప్రచారం చేస్తున్నారని అభిప్రాయపడ్డాయి. ఫ్యాక్ట్ చెక్ పేరిట అదంతా అబద్ధమేనని తేల్చింది.కేవలం ఓ సామాన్యుడు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేయగా.. అదే ప్రచారంగా మారిందని గుర్తించింది. మొత్తానికైతే ఏపీలో కొత్త జిల్లాల అంశం తెరపైకి రావడం విశేషం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More