YSRCP DSC Campaign: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తక్షణం ప్రజామోదం అవసరం. ప్రజల పార్టీని గుర్తించాలి. కూటమిని తిరస్కరించాలి. అది జరగాలంటే కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మాలి. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పని కూడా అదే. అదేపనిగా డీఎస్సీ 2025 పై విషం చిమ్ముతోంది. వస్తే ఆరు లక్షల ఓట్లు.. పోతే 16 వేల ఓట్లు అన్నట్టు ఆ పార్టీ రాజకీయం నడుస్తోంది. అదేపనిగా డీఎస్సీ 2025 పై వ్యతిరేక ప్రచారం చేస్తోంది. కానీ ఎక్కడా ప్రభుత్వం ప్రతి విమర్శలు చేయకుండా చాలా జాగ్రత్తలు పడుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రతి అభ్యంతరంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఫేక్ ప్రచారం అని ప్రజల్లోకి బలంగా వెళ్తోంది.
* జగన్ ను కలిసిన అభ్యర్థులు
ఇటీవల కొంతమంది డీఎస్సీ అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డిని కలిశారు.. తమకు మంచి ర్యాంకులు వచ్చిన ఉద్యోగాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి దీనిని అవకతవకలతో పోల్చేసి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రారంభించారు. డీఎస్సీలో గోల్మాల్ జరిగిందని.. భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ లేనిపోని ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఇక్కడే పాఠశాల విద్యాశాఖ చతురత చూపింది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని కలిసి తమకు ఉత్తమ ర్యాంకులు వచ్చిన ఉద్యోగాలు రాలేదని చెప్పారో.. వారి విషయంలో జరిగిన పరిణామాలు గురించి వివరణ ఇచ్చారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం వారికి ఉద్యోగాలు దక్కలేదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసే క్రమంలో.. కటాఫ్ ను పరిగణలోకి తీసుకొని.. మధ్యలో వికలాంగుల కోటాలాంటివి.. స్పోర్ట్స్ కోటా లాంటివి అమలు చేసిన క్రమంలో వారికి ఉద్యోగాలు రాలేదు అని సావధానంగా చెప్పింది పాఠశాల విద్యాశాఖ. ఆధారాలతో సహా అధికారులు వివరించే ప్రయత్నం చేయడం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రచారం చేస్తోందని స్పష్టం అవుతుంది.
* పేకాట అంశం నవ్వుల పాలు..
మరోవైపు డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద పేకాట ఆడే వారికి అవకాశం కల్పించారని మాజీమంత్రి పేర్ని నాని అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. బ్రిడ్జి అనే స్పోర్ట్స్ కోటా కింద అంటే పేకాటక వర్ణిస్తున్నారు. ఇది కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చే పరిణామమే. ఎందుకంటే అది భారత ప్రభుత్వం గుర్తించిన క్రీడ. క్రీడా కోటాలో ఉద్యోగాల ఎంపిక సమయంలో బ్రిడ్జి అనేది తప్పనిసరి చేసింది. అందుకే స్పోర్ట్స్ కోటాలో 40వ క్రీడగా దానిని పెట్టారు. కానీ ఆ కోటాలో ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఇలా లేనిపోని ప్రచారం చేసి డీఎస్సీ 2025 పై గందరగోళం సృష్టించడమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం. దీనిని గమనించిన ప్రభుత్వం గొడవలకు వెళ్లకుండా.. ప్రత్యరోపణలకు వెళ్లకుండా.. ప్రతి అభ్యర్థి అనుమానాలను నివృత్తి చేస్తోంది.
