Tirumala Laddu : తిరుమల లడ్డూ వివాదం : చంద్రబాబు కోసం సుప్రీంకోర్టునే ఎదురించిన పురంధేశ్వరి

రాజకీయాలలో శత్రుత్వాలు తాత్కాలికం.. అవసరాలు శాశ్వతం.. వెనకటికి ఓ తెలుగు సినిమాలో ఫేమస్ అయిన డైలాగ్ ఇది. అయితే దీనిని కేవలం సినిమా డైలాగులాగే చూడకూడదు. ఎందుకంటే వర్తమాన రాజకీయాలకు, అంతకు ముందు జరిగిన రాజకీయాలకు, ఇకపై జరగబోయే రాజకీయాలకు ఇది వర్తిస్తుంది కాబట్టి.

Written By: Anabothula Bhaskar, Updated On : October 1, 2024 9:44 pm

Purandeshwari

Follow us on

Tirumala Laddu : ఐదు సంవత్సరాల విరామం తర్వాత తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేనతో జతకట్టింది. కూటమిగా ఏర్పడి వైసీపీని ఓడించింది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసింది. ప్రజలు ఇచ్చిన బంపర్ మెజారిటీ ద్వారా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అందులో బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు ప్రాధాన్యం కల్పించారు. ఆంధ్రప్రదేశ్లో బిజెపికి అధ్యక్షురాలిగా ఎన్టీఆర్ పెద్ద కుమార్తె పురందేశ్వరి కొనసాగుతున్నారు. గతంలో పురందేశ్వరి – చంద్రబాబు కుటుంబాలకు మధ్య విభేదాలు ఉండేవి. ఆ తర్వాత వారు కలిసి పోయారు. అయితే ఇటీవల ఏపీలోని తిరుమలలో లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారనే వాదనలు తెరపైకి వచ్చాయి. దీనిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే ప్రస్తావించారు. దీంతో అది కాస్త జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలిగించింది. సహజంగానే తిరుమల అంటే దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదానికి విశేషమైన ప్రాచుర్యం ఉంది. అలాంటి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారని సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. అటు వైసిపి, ఇటు కూటమి అన్నట్టుగా అక్కడ వ్యవహారం సాగింది. ఆ తర్వాత ఈ వివాదం కాస్త సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు ను మందలించింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా అని ప్రశ్నించింది.

సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

ఇది సహజంగానే వైసీపీకి బలంగా మారింది. ఇదే విషయాన్ని నిన్నటి నుంచి తన అనుకూల మీడియాలో తెగ ప్రచారం చేస్తోంది. అయితే దీనికి కౌంటర్ గా టిడిపి అనుకూల మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది. ఇవి జరుగుతుండగానే పార్లమెంట్ సభ్యురాలు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. చంద్రబాబు నాయుడుకు అండగా ఉన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే అధికారం సుప్రీంకోర్టుకు ఎక్కడిదని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలను సుప్రీంకోర్టు తప్పు పట్టడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. ఆయనకు తెలిసిన సమాచారాన్ని చెప్పారని.. అందులో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయాల్సిన అవసరం ఏముందని ఆమె పేర్కొన్నారు.

పురందేశ్వరి ఆ వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ సోషల్ మీడియా విభాగం గేమ్ మొదలుపెట్టింది. చూశారా సుప్రీంకోర్టును పురందేశ్వరి తప్పు పడుతోందని ప్రచారం ప్రారంభించింది. ఇక దీనికి తగ్గట్టుగానే టిడిపి అనుకూల సోషల్ మీడియా విభాగం కూడా రెచ్చిపోతుంది. గతంలో సుప్రీంకోర్టును ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తాలూకూ వీడియోలను కౌంటర్ గా పోస్ట్ చేస్తోంది.. మొన్నటిదాకా ఏపీ రాజకీయాలను శాసించిన తిరుమల లడ్డు వివాదం.. మళ్లీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.