AP Politics: ఏపీ( Andhra Pradesh) విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో సమావేశం కావడం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు. వారిద్దరి మధ్య సుదీర్ఘ భేటీ కొనసాగింది. ఇది సాధారణ భేటీ కాదని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకిలించే భారీ వ్యూహంతో జరిగిన సమావేశం అని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లోని ప్రకంపనలు సృష్టిస్తోంది. మున్ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా అంశాల్లో టార్గెట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
* పవన్ ప్రత్యేక చొరవ..
పవన్( Pawan Kalyan) ఢిల్లీ వెళ్లారు. అమిత్ షా తో భేటీ అయ్యారు. అటు నుంచి వచ్చిన వెంటనే జనసేన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే విషయంలో వైఫల్యాలను ప్రస్తావించారు. చివరకు తన సోదరుడు నాగబాబును సైతం తప్పు పడుతూ మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి ఎందుకు మాట్లాడలేదని కూడా ప్రశ్నించారు. అలా సొంత పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసిన పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈరోజు మళ్లీ సీఎం చంద్రబాబు తో పాటు బిజెపి నేతలతో కూడా సంయుక్త సమావేశం నిర్వహిస్తున్నారు పవన్. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ భారీ వ్యూహం సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది.
* ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు..
నెయ్యి వివాదానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం( special investigation team) చేపట్టిన విచారణ, దానికి సంబంధించి ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేసింది. అయితే 36 మంది నిందితులుగా చూపింది. అందులో కల్తీ నెయ్యి సరఫరా చేసిన డైరీ యజమానులు, టిటిడి మాజీ ఉద్యోగుల పాత్ర బయటపడింది. నెయ్యి బదులు పామాయిల్ మిశ్రమాన్ని, కెమికల్స్ ను వాడి కోట్లాదిమంది భక్తుల నమ్మకాన్ని తాకట్టు పెట్టిన వారిని అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం బలమైన సందేశాన్ని పంపాలని నిర్ణయించింది. కేవలం అరెస్టులకి పరిమితం కాకుండా.. గత ప్రభుత్వంలోని కీలక నేతల ప్రమేయంపై ఆధారాలను ప్రజల ముందు ఉంచే ఆలోచనలో ఉంది కూటమి.
* భారీ బహిరంగ సభలకు ప్లాన్..
ఒక్క మాటలో చెప్పాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక విధానాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయనుంది కూటమి. ఈ అంశాన్ని కేవలం ఒక కేసుగా మాత్రమే కాకుండా.. హిందూ ధర్మ పరిరక్షణ కోణంలో సామాన్య భక్తుల దగ్గరకు తీసుకెళ్లాలని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఎదురుదాడిని సమర్థవంతంగా తిప్పి కొట్టడమే కాకుండా.. వారు చేసిన తప్పులను ప్రజల వద్ద చర్చించేలా ప్రచార వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రజాక్షేత్రంలో భారీ బహిరంగ సభలు లేదా ధర్మరక్షణ యాత్రల ద్వారా ప్రజలకు వాస్తవాలను వివరించే అవకాశం ఉంది. ఈ విషయంపైనే పవన్ కళ్యాణ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చర్చించారని.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత పవన్ ఈ విషయంపై సీఎం చంద్రబాబుతో చర్చించారని.. ఈరోజు రాష్ట్ర బిజెపి నేతలతో కలిసి భారీ వ్యూహరచన చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే టార్గెట్ అవుతుందన్నమాట.