Chandrababu Naidu and Devansh: ఏపీ సీఎం చంద్రబాబు కు తిరుమల అంటే ఎంతో నమ్మకం. ఆది నుంచి చంద్రబాబు వెంకటేశ్వర స్వామికి భక్తులు. అలిపిరిలో మావోయిస్టుల దాడి నుంచి బయటపడ్డారు చంద్రబాబు. శ్రీవారి దయతోనే తనకు పునర్జన్మ వచ్చిందని భావిస్తుంటారు ఆయన. అందుకే నిత్యం స్వామి వారిని దర్శించుకుంటారు ఆయన కుటుంబ సభ్యులు. ఆయన కుటుంబ సభ్యుల పుట్టినరోజు నాడు శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఆయన మనువడు దేవాన్ష్ పుట్టిన తర్వాత ప్రతి ఏటా పుట్టినరోజు నాడు టీటీడీ అన్నదానానికి భారీగా విరాళం ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఈ ఏడాది కూడా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు తిరుమల శ్రీవారి సన్నిధిలో ఘనంగా జరుపుకున్నారు.
వేకువ జామునే తిరుమలకు..
వేకువజామునే చంద్రబాబు కుటుంబ సభ్యులు తిరుమల చేరుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. గోత్రనామాలతో పూజలు జరిపించి ఆశీర్వాదం అందించారు. అనంతరం చంద్రబాబు తన మనుమడుతో భక్తులకు అన్న ప్రసాద వితరణ గావించారు. భక్తులకు స్వయంగా సీఎం చంద్రబాబు, ఆయన మనువడు దేవాన్ష్ వడ్డించడం విశేషం. దేవాన్ష్ కూడా ఎంతో ఉత్సాహంగా భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించడం చూసి చంద్రబాబు మురిసిపోయారు.
అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు..
పుట్టినరోజు నాడు దేవాన్ష్ తో అన్నదాన ప్రసాద వితరణ గావించడం ఆనవాయితీ. ప్రతిరోజు తిరుమలలో భక్తుల అన్న ప్రసాద వితరణకు 44 లక్షల రూపాయల ఖర్చు చేస్తుంటారు. అందుకే ఈ మొత్తాన్ని ముందుగానే టీటీడీకి చెల్లించారు సీఎం చంద్రబాబు. మొన్నటికి మొన్న లోకేష్ పుట్టినరోజు నాడు కూడా టీటీడీకి అన్నదాన ప్రసాద వితరణ నిమిత్తం భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ 44 లక్షల రూపాయలు అందించారు. భక్తులు అన్నప్రసాదానికి విరాళాలు అందించవచ్చు. అయితే ఏటా దేవాన్ష్ పుట్టినరోజు నాడు పండుగ వాతావరణం లో వేడుకలు జరుపుతుంటారు చంద్రబాబు. అయితే అదేదో ఆర్భాటంగా కాదు. కేవలం తిరుమల శ్రీవారి సన్నిధిలో.. భక్తుల అన్న ప్రసాద వితరణ రూపంలో.. వేడుకలను జరుపుకోవడం విశేషం.
