Homeఆంధ్రప్రదేశ్‌Roja: రోజా చుట్టూ ఉచ్చు.. రంగంలోకి సిఐడి?

Roja: రోజా చుట్టూ ఉచ్చు.. రంగంలోకి సిఐడి?

Roja: మాజీ మంత్రి రోజా చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? ఆమెపై త్వరలో సిఐడి విచారణ ప్రారంభం కానుందా? ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో 100 కోట్ల రూపాయల స్కాం జరిగిందా? దీనిపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రోజా క్రీడల శాఖ మంత్రిగా వ్యవహరించారు. విస్తరణలో భాగంగా జగన్ ఆమెకు క్యాబినెట్ లో చోటు కల్పించారు. అయితే ఎన్నికలకు ముందు ఆడుదాం ఆంధ్ర పేరిట క్రీడా పోటీలు నిర్వహించారు. పంచాయతీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలు కొనసాగాయి. అయితే అడుగడుగునా అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ విషయం బయటపడింది. దీనిపై ఏపీ సిఐడి కి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు ఫిర్యాదు చేస్తున్నారు.

క్రీడల శాఖ మంత్రిగా ఆర్కే రోజా ఉండేవారు. శాప్ చైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యవహరిస్తుండేవారు ఈ ఇద్దరు నేతలు వివాదాస్పదులే. నోరు తెరిస్తే చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకు పడేవారు. పవన్ ను విడిచి పెట్టేవారు కాదు. అయితే సరిగ్గా సంక్రాంతికి ముందు ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టారు. క్రికెట్ నుంచి పలు క్రీడా పోటీలు నిర్వహించారు. అయితే ఈ పోటీల నిర్వహణలో భారీగా అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణ ఉంది. మొత్తం 100 కోట్ల అక్రమాలు జరిగాయని క్రీడా సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. శాప్ ఎండీలు, ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల డి ఎస్ డి ఓ లు ఈ అవినీతిలో పాత్రధారులని ఆరోపణలు ఉన్నాయి.చాలా చోట్ల అసలు పోటీలు నిర్వహించకుండానే విజేతలను ఎంపిక చేశారని, వైసీపీ నేతల సిఫారసులకి పెద్దపీట వేశారని ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు చేయాలని క్రీడా సంఘాల ప్రతినిధులు రాష్ట్ర అత్యున్నత దర్యాప్తు సంస్థను కోరారు.

క్రీడాకోటా ద్వారా ఉన్నత విద్య ప్రవేశాలకు సంబంధించి అవకతవకలు జరిగాయని కూడా ఆరోపణలు వస్తున్నాయి. మెడికల్, ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు సంబంధించి స్పోర్ట్స్ కోటాను పరిగణలోకి తీసుకుంటారు. దీంతో వైసీపీ నేతల సిఫారసులు ఉన్నవారికి స్పోర్ట్స్ కోటా కింద రిజర్వేషన్ కల్పించారని.. ఆ కోటా తో చాలామంది ఉన్నత విద్య ప్రదేశాలు పొందారని ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా క్రీడల శాఖ మంత్రిగా మంత్రి రోజా అనేక అవకతవకల్లో సూత్రధారిగా ఉన్నారని, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హస్తం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. వైసిపి హయాంలో ఆ ఇద్దరు నేతలు దూకుడు స్వభావంతో ఉండడం.. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఉండడంతో.. వారి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు సమాచారం. క్రీడా సంఘాల ప్రతినిధుల ఫిర్యాదులను సిఐడి సీరియస్ గా తీసుకుందని.. త్వరలో కేసులు నమోదు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular