Pawan Vs Jagan : పవన్ అంతరంగం అంతుపట్టడం లేదు. రాజకీయ ప్రత్యర్థులకు అస్సలు మింగుడుపడడం లేదు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పవన్ మిగతా రాజకీయ పక్షాలను డిఫెన్స్ లో పడేస్తున్నారు. వారాహి తొలి విడత యాత్రలో జనసేనకు ఓ అవకాశం ఇవ్వండని ప్రజలను కోరారు. సుపరిపాలన అందిస్తానని చెప్పుకొచ్చారు. రెండో విడతలో మాత్రం ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. పాలన విధానం, వైఫల్యాలను ఎండగడుతున్నారు. ముఖ్యంగా జగన్ ఆయువుపట్టులపై ఫోకస్ పెంచారు. వచ్చే ఎన్నికల్లో ఏ వ్యవస్థల ద్వారా గట్టెక్కాలని చూస్తున్నారో వారినే టార్గెట్ చేసుకున్నారు,
ప్రజలకు బ్లాక్ మెయిల్..
ప్రజా వ్యతిరేకత ఒక వైపు, చాలా వర్గాలు దూరం కావడం మరోవైపు జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయినా సరే గెలుస్తానన్న ధీమా జగన్ ది. అయితే ఈ ధీమా వెనుక ఉన్నది మాత్రం సంక్షేమ పథకాలే. తాను అధికారానికి దూరమైన మరుక్షణం మీ పథకాలు నిలిచిపోతాయని ప్రజలకు ఓ రకమైన ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు. మరోవైపు గ్రామస్థాయిలో వలంటీర్లు, గృహ సారథులు అప్పుడే ఓటర్లను వైసీపీ వైపు టర్న్ చేసేందుకు చేయని ప్రయత్నం లేదు. గడపగడపకూ మన ప్రభుత్వంలో భాగంగా గ్రామాలకు వెళుతున్న వైసీపీ ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు కంటే వలంటీర్లను పిలిచి మరీ ఆదేశాలిస్తున్నారు. నేరుగా ప్రజలనే భయపెట్టండి అంటూ సలహా ఇస్తున్నారు.
ఆ విజయాలతో..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కేడర్ కంటే వలంటీర్లే పనిచేశారు. దాని ఫలితమే ఏకపక్ష విజయం. ప్రతీ 50 కుటుంబాల డేటా మొత్తం వలంటీర్ల వద్ద ఉంది. అక్కడక్కడా ఈ డేటాను కొందరు వలంటీర్లు దుర్వినియోగం చేస్తున్నారు. విద్యార్థినులు, మహిళలను ఇబ్బందిపెట్టిన ఘటనలున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మంచి సంబంధాలు ఏర్పాటుచేసుకున్న వలంటీర్లు వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా వైసీపీ వైపు మళ్లించడానికి అవకాశాలున్నాయి. వలంటీర్ల వ్యవస్థపై ఎన్నిరకాల ఆరోపణలు వస్తున్న విపక్షం నుంచి ఆ స్థాయిలో వ్యాఖ్యలు లేవు. ఒకానొక దశలో లోకేష్ సైతం తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల ను కొనసాగిస్తామని చెప్పడం ద్వారా ఆ వ్యవస్థకు ఏ స్థాయిలో భయపెడుతున్నారో అర్ధమవుతోంది.
వైసీపీ శ్రేణుల్లో ఆందోళన
ఇప్పుడు పవన్ ఆ చిన్న కంటెంట్ తీసుకున్నారు. ఆ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపారు. వైసీపీ అంతర్భాగమే వలంటీర్ వ్యవస్థగా ఆరోపణలు చేశారు. అయితే ప్రజల్లో కూడా ఆ రకమైన భావనే ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలో వలంటీరు వ్యవస్థపై పవన్ గళమెత్తడం విశేషం. తొలి విడత యాత్రలో జనసేన విధానాలపై మాట్లాడిన పవన్.. రెండో విడత యాత్రకు వచ్చేసరికి ప్రభుత్వ వైఫల్యాలపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ వ్యవస్థను అడ్డంపెట్టుకొని జగన్ మరోసారి గెలవాలనుకున్నారో.. వాటిపైనే సూటిగా విమర్శలు చేస్తున్నారు. అయితే దీనిపై ఎలా స్పందించాలో తెలియక వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.