Byreddy Siddharth Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పై కేసు నమోదయింది. మంత్రులు నారా లోకేష్ తో పాటు టీజీ భరత్ పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఓ కంపెనీ ఏర్పాటుకు 45 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారు అంటూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. గత రెండు రోజులుగా కర్నూలు జిల్లాలో ఇవే హాట్ టాపిక్. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తీరుపై మంత్రి టీజీ భరత్, ఎంపీ బైరెడ్డి శబరి గట్టిగానే రిప్లై ఇచ్చారు. జోకర్, పిల్ల ఖైదీ, నేరస్తుడు అంటూ విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా మంత్రి టీజీ భరత్ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఆధారాలు లేకుండా మాట్లాడినందుకు ఆయనకు జైల్లో వేసే అవకాశం కూడా కనిపిస్తోంది.
* దూకుడుగా యువనేత..
ఇటీవల కర్నూలు జిల్లా రాజకీయాల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దూకుడుగా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మౌనం వహిస్తున్నారు. ఈ సమయంలో సిద్ధార్థ రెడ్డి చేస్తున్న ఆరోపణలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పక్క రాజకీయ వ్యూహంతోనే ఆయన ఆరోపణలు ఉన్నట్లు అర్థం అవుతోంది. తనకు జైలు కొత్త కాదు అని.. అక్కడ మొక్క కూడా వేశానని.. వెళ్లి అలా చూస్తాను అంటూ వెటకారంగా మాట్లాడారు. రోజులు, నెలలు, సంవత్సరాలు.. అంతకంటే ఏం చేస్తారు లే అన్నట్టు ఆయన కామెంట్స్ ఉన్నాయి. ఆపై బైరెడ్డి శబరి చదువులు, రాజకీయ పదవులపై సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బైరెడ్డి కావాలనే రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారన్నది ఒక అనుమానం. అయితే ఎట్టి పరిస్థితుల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని వదలకూడదని కూటమి నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
* పార్టీని క్రియాశీలకం చేసేందుకు
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో తన పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బయటకు వచ్చేసారు. భారతీయ జనతా పార్టీలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో బైరెడ్డి శబరి కి తెలుగుదేశం పార్టీ నంద్యాల ఎంపీ టికెట్ లభించడంతో ఆమె పోటీ చేసి గెలిచారు. కర్నూలు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు సీట్లకు మాత్రమే పరిమితం అయింది. పార్టీలో సీనియర్లంతా ఓడిపోయారు. పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ పార్టీని యాక్టివ్ చేసే బాధ్యతను జగన్మోహన్ రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి అప్పగించారు. అందుకే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అరెస్టుకు సిద్ధపడి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థం అవుతోంది. ఇప్పటికే ఆడుదాం ఆంధ్ర విజిలెన్స్ విచారణలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఇప్పుడు అరెస్టు ఖాయం అన్నట్లు టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
