Botsa Goodbye to Politics: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కానీ.. తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ఆయన శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా దక్కించుకోలేకపోయారు. అయితే శాసనమండలిలో వైసిపి పక్ష నాయకుడిగా బొత్సకు మాత్రం ప్రతిపక్ష హోదా ఉంది. ప్రోటోకాల్ ప్రకారం క్యాబినెట్ హోదా ఆయనది. అయితే గత కొంతకాలంగా బొత్స సైలెంట్ గా ఉన్నారు. కనీసం రాజకీయాల గురించి మాట్లాడడం లేదు కూడా. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆ మధ్యన విశాఖలో ప్రెస్ మీట్ పెట్టి బోరున విలపించారు. అప్పట్లో ముఖ్యమంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలపై బొత్స ఎద్దేవా చేసిన సందర్భాలు ఉన్నాయి. దానికోసం టిడిపి మంత్రి అచ్చెనాయుడు కామెంట్స్ చేసేసరికి మీడియా ముందుకు వచ్చి బోరున విలపించారు. అప్పటినుంచి ఆయన పొలిటికల్ గా యాక్టివ్ గా లేరు.
తరచూ అనారోగ్య సమస్యలు..
గత ఎన్నికల తర్వాత బొత్స అనారోగ్యం భారిన పడుతున్నారు. గతంలో సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళన కార్యక్రమాలు జరిపారు. ఆ సమయంలో మాట్లాడుతుండగానే కుప్పకూలిపోయారు. ఇంకోసారి అసెంబ్లీలో అస్వస్థతకు గురయ్యారు. చాలా రోజులపాటు హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స కూడా పొందారు. వచ్చిన తర్వాత కూడా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి పై గతంలో చేసిన ఆరోపణలను టిడిపి గుర్తు చేస్తే కన్నీటి పర్యంతం అయ్యారు. అటు తరువాత పొలిటికల్ గా కనిపించకుండా మానేశారు. అందుకే ఇప్పుడు బొత్స పై విస్తృత చర్చ నడుస్తోంది. అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పదవి నుంచి తప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటన నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దీనిపై సీనియర్లతో చర్చిస్తారని సమాచారం.
రాజకీయాల్లో సుస్థిర స్థానం..
ఏపీ రాజకీయాల్లో బొత్సది ప్రత్యేక స్థానం. విజయనగరం జిల్లాలో ఓ సామాన్య నేతగా పొలిటికల్ అరంగేట్రం చేసిన బొత్స అనతి కాలంలోనే రాష్ట్రస్థాయి నేతగా ఎదిగారు. బలమైన నాయకుడు కావడంతో జగన్మోహన్ రెడ్డి సైతం ప్రత్యేకంగా ఆహ్వానించి పార్టీలోకి తెచ్చుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున బొత్సతోపాటు ఆయన కుటుంబం గెలిచింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కుటుంబంలో ఐక్యత లేదు. ఆపై బొత్స నిత్యం అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆయనకు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు సైతం బొత్సకు విశ్రాంతి ఇవ్వాలని కోరుతున్నారు అధినేత జగన్మోహన్ రెడ్డిని. త్వరలో దీనిపై జగన్మోహన్ రెడ్డి సైతం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే శాసనమండలిలో వైసీపీ పక్ష నాయకుడి పదవి కోసం అప్పుడే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పోటీ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.