Baireddy Siddharth Reddy: కర్నూలు జిల్లా వైసీపీ రాజకీయాల్లో యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పెద్ద రచ్చ పెట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఒక్కడే నాయకుడు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన దాఖలాలు లేవు. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు దూకుడు పెంచినట్లు అర్థం అవుతోంది. ఇటీవల ఆయన మంత్రి టీజీ భరత్ పై చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడాన్ని సవాల్ చేస్తూ టీజీ భరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. నోటీసులు జారీ చేశారు. అయితే సిద్ధార్థ రెడ్డి ఈ సంచలన కామెంట్స్ వెనుక భారీ రాజకీయ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. అది అంతర్గతంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నట్లు సమాచారం. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దూకుడుకు కళ్లెం వేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే నేరుగా హై కమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
* మంత్రిపైనే ఆరోపణలు..
ఇటీవల కర్నూలు జిల్లాలో దూకుడు పెంచారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మంత్రి టీజీ భరత్ ను టార్గెట్ చేసుకున్నారు. ఓ పరిశ్రమ ఏర్పాటుకు 45 కోట్ల రూపాయల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు చేశారు. మధ్యలో లోకేష్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఈ తరుణంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి రంగంలోకి దిగారు. సోదరుడు సిద్ధార్థ రెడ్డికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలోనే నేరుగా మంత్రి టీజీ భరత్ సిద్ధార్థ రెడ్డి పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఒక్కసారిగా సిద్ధార్థ రెడ్డి పేరు మార్మోగిపోయింది. అయితే పక్కా వ్యూహంతో కర్నూలుపై కన్నేసిన సిద్ధార్థ రెడ్డి టీజీ భరత్ ను టార్గెట్ చేసుకున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గ్రహించారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు నుంచి పోటీ చేసేందుకే సిద్ధార్థ రెడ్డి ఈ ఎత్తుగడ వేసినట్టు గుర్తించారు. అందుకే హై కమాండ్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
* పార్టీలో ప్రకంపనలు..
వచ్చే ఎన్నికల్లో కర్నూలు నగరంలో పోటీ చేసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే చాలామంది నేతలు ఉన్నారు. ఇప్పటికే వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ నంద్యాల జిల్లాకు చెందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కర్నూలు నగర నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. ఇప్పటివరకు ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు నగరం నుంచి పోటీ చేసేందుకు గాను సిద్ధార్థ రెడ్డి ఎత్తుగడ వేసినట్లు అర్థం అవుతుంది. అయితే దీని వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉన్నట్లు సమాచారం. ఆయన ప్రోత్సాహంతోనే సిద్ధార్థ రెడ్డి రాజకీయంగా దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే కర్నూలు వైసీపీలో ప్రకంపనలు రేపుతున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.
