APSRTC Good News For Women: ఏపీ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించింది. దాదాపు 5 రకాల బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణం కొనసాగుతోంది గత కొంతకాలంగా. ఇప్పుడు మహిళల భద్రత, సంక్షేమం లక్ష్యంతో మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రయాణ సమయంలో మహిళలు ఎదుర్కొనే అత్యంత సున్నితమైన, అత్యవసరమైన నెలసరి ఇబ్బందులను దూరం చేసేందుకు ఆర్టీసీ బస్సుల్లో శానిటరీ న్యాప్ కిన్స్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ సర్వీసులో త్వరలోనే అధికారికంగా అమలు చేయనున్నారు.
* పెరిగిన మహిళల ప్రయాణం..
ఉచిత ప్రయాణ పథకం తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణం పెరిగింది. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు సైతం ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇలా వెళ్లే సమయంలో అనుకోని విధంగా నెలసరి వస్తే బస్సుల్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనిని అధిగమించేందుకు ప్రతి ఆర్టీసీ బస్సుల్లోనూ శానిటరీ న్యాప్ కిన్స్ అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి లేఖ రాశారు. కేవలం బస్టాండ్లలోనే కాకుండా.. ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ఇవి దొరికితే మహిళలకు ఎంతో పోరాట కలుగుతుంది. పౌర సమాజంలో మహిళల ఆరోగ్య రక్షణకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని ఆమె ఆ లేఖలో ప్రభుత్వానికి ప్రతిపాదించారు.
* మంత్రి సానుకూల స్పందన..
మహిళా కమిషన్ చైర్ పర్సన్ అరుణ చేసిన ప్రతిపాదనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. మహిళల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే ఈ డిమాండ్ ను తక్షణమే ఆమోదించి.. ఆర్టీసీ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని రాయపాటి శైలజ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ.. మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సుదూర ప్రాంత సర్వీసులు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రత్యేక బాక్సులలో ఈ న్యాప్ కిన్స్ అందుబాటులో ఉంచేందుకు ఆర్టీసీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

