APSRTC Bus Viral Video: ఆర్టీసీ ఉద్యోగుల తీరుతో ఏపీ ప్రభుత్వానికి నష్టం జరుగుతోంది. ప్రజల్లో ప్రభుత్వం పలుచన అవుతోంది. ఆర్టీసీ బస్సులను ప్రయాణికులు చేయి ఎత్తిన చోట ఆపాలన్న నినాదం ఉంది. పల్లె వెలుగు సర్వీసులకు ఇది తప్పకుండా వర్తిస్తుంది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో చాలాచోట్ల ఆర్టీసీ బస్సులు బస్టాండ్లలో ఆపడం లేదు. ప్రయాణికులు ఎదురుగా కనిపిస్తున్నా కనికరించడం లేదు. ముఖ్యంగా ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ప్రస్తుతం దీనిపైన ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. ఎక్కడికక్కడే నిలదీతలు ఎదురవుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో చోట ఇటువంటి ఘటన జరుగుతూనే ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. శ్రీకాకుళం జిల్లాలో తాజాగా ఓ యువకుడు ఇలానే బస్టాండ్ లో ఆపకుండా వెళ్లిపోయిన ఆర్టీసీ బస్సును వెంబడించి మరి సిబ్బందిని నిలదీశారు.
* ఇటీవల ఓ ఎమ్మెల్యే సైతం..
ఇటీవల కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో సైతం ఇదే మాదిరిగా జరిగింది. బస్టాండ్ లో ప్రయాణికులు వేచి చూస్తుండగా బస్సు ఆపకుండా వెళ్లిపోయింది. ఆ వెనుక వాహనంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆర్టీసీ బస్సును వెంబడించారు. బస్సు ఎదురుగా వాహనాన్ని నిలిపారు. దీంతో బస్సు నిలిచింది. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బస్సులో ఎక్కిన ఎమ్మెల్యే ప్రసాద్ సిబ్బంది తీరును తప్పు పట్టారు. ఎందుకు బస్సు బస్టాండ్ లో ఆపలేదని ప్రశ్నించారు. మీరు చేస్తున్న పనికి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని.. ప్రతి బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులను ఎక్కించుకోవాలని సూచించారు. అయితే ఆ ఘటన సైతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్టీసీ సిబ్బంది తీరుపై విమర్శలు కూడా వ్యక్తం అయ్యాయి.
* శ్రీకాకుళం జిల్లాలో..
తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ఓ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు బయలుదేరింది. అయితే సమీపంలోని ఓ బస్టాండ్ వద్ద పదుల సంఖ్యలో ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఇంతలో ఆర్టీసీ బస్సు ఒకటి వచ్చింది. కానీ ఆపకుండా వెళ్ళిపోయింది. అక్కడే ఉన్న యువకుడు బైక్ పై బస్సును వెంటాడాడు. బస్సును ఆపి డ్రైవర్ తో పాటు కండక్టర్ ను నిలదీశాడు. ఇలాంటి వారితో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఉచిత ప్రయాణ పథకం కల్పించిన నాటి నుంచి ఆర్టీసీ సిబ్బంది వైఖరిలో మార్పు వచ్చింది. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ యువకుడు నిలదీసినంత పని చేశాడు. ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.