YSRCP Caste Politics: తప్పు చేసిన వాడిని తప్పుడు వాడు అనకూడదు. గంజాయి.. ఇతర దుర్మార్గాలకు పాల్పడేవాడిని దుర్మార్గుడు అనకూడదు. వారు హత్యలు చేసినా సరే నిశ్శబ్దంగా ఉండాలి. ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసినప్పటికీ మౌనంగా ఉండాలి. పైగా వారికి సెల్యూట్ చేస్తూ.. గొప్ప వ్యక్తులుగా కీర్తించాలి.. ఇదిగో ఇలానే ఉంది వైసీపీ సూత్రీకరణ. ఆ పార్టీలో ఉన్న నేతల వ్యవహార శైలి రోజురోజుకు దిగజారిపోతుంది. చివరికి రౌడీ షీటర్లకు.. మాదకద్రవ్యాలను విక్రయించే వారికి ఆ పార్టీ నేతలు సంఘీభావం పలుకుతున్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆ రాజకీయాలు స్టార్ట్
2024 ఎన్నికల్లో 11 స్థానాలు వచ్చిన తర్వాత.. ఎందుకు ఈ స్థాయిలో దిగజారిపోయాము.. సాక్షి పేపర్ ద్వారా భజన కొట్టుకున్నప్పటికీ ప్రజలు ఎందుకు నమ్మలేదు.. అనే విషయాలను జగన్ పట్టించుకోవడం లేదు. పైగా తనని ఓడించి ప్రజలు తప్పు చేశారని అంటున్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించకుండా.. రౌడీలకు.. దుర్మార్గులకు అందలమెక్కించి.. ప్రజలను హింసించిన జగన్ ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం నిజంగా హాస్యాస్పదమని టిడిపి నేతలు అంటున్నారు. పైగా సాయి కృష్ణ ఉదంతాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకొని జగన్ మళ్ళీ కుల రాజకీయాలు మొదలుపెట్టాడని టిడిపి నేతలు అంటున్నారు.
ఈరోజు సాక్షి పత్రికలో ఏపీలో కులాలను రెచ్చగొట్టే విధంగా కథనాలు ప్రసారమయ్యాయి. అందులో సాయి కృష్ణ కులాన్ని కాపు.. మరో వ్యక్తి కులాన్ని మాదిగగా ప్రస్తావించిన ఆ పత్రిక.. కులాల కుంపట్లు రగిలించే విధంగా కథనాలు రాసింది. ఇప్పటికే ఈ వ్యవహారాల మీద ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. బాధ్యులైన అధికారుల మీద చర్యలకు ఉపక్రమించింది. అయినప్పటికీ అంబటి రాంబాబు వంటి వారు చనిపోయిన నవీన్ రెడ్డి ఫోటోను సాయి కృష్ణ గా పేర్కొనడం.. ఏపీ పోలీసుల మీద అడ్డగోలుగా విమర్శలు చేయడం.. సొంత పత్రికలో నీచాతి నీచంగా రాయించడం విశేషం. చివరికి పోలీసు దర్యాప్తులో చనిపోయింది నవీన్ రెడ్డి అని.. అతడు సాయి కృష్ణ చేతిలో చనిపోయాడని తేలింది. ఇప్పుడు వైసిపి కొత్తగా ఆ విషయాన్ని పక్కన పెట్టి కుల రాజకీయాలు ప్రారంభించింది.
కాపు, మాదిగ కులాల పేరు తెరపైకి తెస్తూ.. ఏపీలో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు కుట్ర చేస్తున్నట్టు తెలుస్తోందని టిడిపి నేతలు అంటున్నారు. ఇప్పటికే వైసిపి అధికారిక ఫేస్ బుక్ ఖాతాను మెటా కంపెనీ బ్యాన్ చేసింది. అయినప్పటికీ ఆ పార్టీ నేతలకు బుద్ధి రావడం లేదు. ఆ పార్టీ అధినేత కుల రాజకీయాలు మానుకోవడం లేదు. ఇలాంటప్పుడే కూటమినేతలు జాగ్రత్తగా ఉండాలి. ఏ తప్పు జరగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పోలీసులను పకడ్బందీగా వ్యవహరించాలని సూచించాలి. ఏ మాత్రం అవకాశం దొరికినా సరే జగన్ అండ్ కో రెచ్చిపోవడం ఖాయం. ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో దళిత డాక్టర్ సుధాకర్.. దళిత విద్యార్థి హత్య.. ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన దారుణం.. ఇవన్నీ లెక్కేసుకుంటే దళితులకు జీవితాంతం పాద పూజ చేసిన సరే వైసీపీ చేసిన దుర్మార్గాలు పరిహారం కావని టిడిపి నేతలు అంటున్నారు.
