Andhra Pradesh Weather Update: ఏపీలో భిన్న వాతావరణం ఉంది. ఒకవైపు ఎండలు, ఇంకోవైపు వర్షాలు ప్రభావం చూపుతున్నాయి. మధ్య బంగాళాఖాతం నుంచి తెలంగాణ, కోస్తాంధ్ర, కర్ణాటక వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్య ఛాన్స్ కూడా కనిపిస్తోంది. పగటిపూట ఎండలు, సాయంత్రం పూట వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో మూడు రోజులపాటు ఇలానే ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. ఉష్ణోగ్రతలతో పాటు వర్షాలపై కూడా కీలక అప్డేట్ ఇచ్చింది. ఇంకోవైపు నైరుతి రుతుపవనాల ప్రవేశం తో ఎక్కడికక్కడే వాతావరణం మారుతోంది.
* ఉపరితల ఆవర్తన ప్రభావంతో
ప్రస్తుతం ఉపరితల ఆవర్తన ప్రభావంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. మరో మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు, కొంత ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో గురువారం మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది.
* మరోవైపు బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయం నాటికి శ్రీకాకుళం జిల్లా గరికిపాలంలో 72 మిల్లీమీటర్లు, లావేరులో 64 మిల్లీమీటర్లు, పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలో 48 మిల్లీమీటర్లు, అనకాపల్లి జిల్లా రావికమతంలో 29 మిల్లీమీటర్లు, ఎస్ రాయవరంలో 28 మిల్లీమీటర్లు, విశాఖ జిల్లా పెందుర్తిలో 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
* గురువారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 13 మండలాల్లో తీవ్రవడగాలులు, 42 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. అందుకే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ గట్టిగానే హెచ్చరికలు పంపుతోంది.

