AP Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో( Telugu States) విచిత్ర వాతావరణ కొనసాగుతోంది. రాత్రంతా చలి. పగలంతా వేడి అన్నట్టు ఉంది పరిస్థితి. ఈ క్రమంలో చలితోపాటు ఎండలు కొనసాగుతున్నాయి. మరోవైపు వేసవి ప్రారంభంలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ నుంచి సంకేతాలు అందుతున్నాయి. ఈ నెలలో చలి, ఎండ, వానలతో విచిత్రమైన పరిస్థితులు ఉండనున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. సంక్రాంతి తర్వాత నుంచి ఎండల తీవ్రత పెరిగింది. కానీ చలి తగ్గుముఖం పట్టడం లేదు. కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో చలి వాతావరణం ఉంటుంది. కానీ రోజంతా ఎండలు మండిపోతున్నాయి.
ఆ ప్రాంతాల్లో హాట్.. ఉత్తరాంధ్రలోని( North Andhra) మన్య ప్రాంతాల్లో చలి వణికిస్తోంది. మిగతా ప్రాంతాల్లో మాత్రం మినీ సమ్మర్ తలపిస్తోంది. ముఖ్యంగా విజయవాడ, అమరావతి, గుంటూరు, కడప, నంద్యాల, కర్నూలు, తిరుపతి వంటి నగరాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం, రాత్రులు చలి.. మధ్యాహ్నం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. శివరాత్రి దాటిన తర్వాత కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్య ఉష్ణోగ్రతలు 35 నుంచి 38 డిగ్రీలకు చేరే అవకాశాలు ఉన్నాయి. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే.. నడివేసవిలో ఎలా ఉంటుందో నన్న ఆందోళన కనిపిస్తోంది.
విపరీతమైన పొగ మంచు..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో చలి కొనసాగుతోంది. పొగ మంచు కూడా పడుతోంది. విశాఖ మన్యంలో ఇప్పటికీ పొగ మంచు తీవ్రత అధికంగా ఉంది. రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు కూడా. తరచూ ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. అందుకే ఉదయం తొమ్మిది గంటల తర్వాత ప్రయాణాలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో గురువారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఉత్తరాది నుంచి పొలిగాలులు కొనసాగుతుండటమే ఇందుకు కారణం.
