Andhra Pradesh Rajya Sabha Seats: ఏపీలో ఇంకా రాజ్యసభ పదవులు ఎంపిక జరగలేదు. నామినేషన్లకు మరో మూడు రోజులు గడువు మాత్రమే ఉంది. కూటమి నుంచి అభ్యర్థుల ప్రకటన జరగలేదు. నాలుగు పదవులను కూటమిలోని మూడు పార్టీలు ఎలా సర్దుబాటు చేసుకుంటాయి అనేది తెలియడం లేదు. ఈసారి బిజెపికి ఛాన్స్ ఇస్తారా? లేదా? అన్నదానిపై కూడా క్లారిటీ రావడం లేదు. అసలు అభ్యర్థుల ఎంపికపై ఏం చేశారు అన్నది తెలియడం లేదు. అయితే ఈసారి జనసేనకు మాత్రం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు పదవి విరమణ చేస్తున్న టిడిపి సభ్యుడు సానా సతీష్ కు మరోసారి ఛాన్స్ అన్నది తేలిపోయింది. అయితే బిజెపికి పదవి ఇస్తారా లేదా అన్నది బయటపడడం లేదు. అయితే ఈ గోప్యత ఎందుకు ప్రదర్శిస్తున్నారో తెలియడం లేదు. ఆశావహులు ఎక్కువగా ఉండటమే కారణం అన్నది స్పష్టం అవుతుంది. కానీ గడువు చూస్తే సమీపిస్తోంది. కూటమి నుంచి ఎటువంటి కదలిక లేదు.
* 8తో నామినేషన్ల గడువు
దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ప్రస్తుతం నామినేషన్ల పర్వం నడుస్తోంది. ఈనెల 8 తో గడువు ముగియనుంది. ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ పదవుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతోంది. కానీ కూటమి నుంచి అభ్యర్థులను ఖరారు చేస్తూ ఎటువంటి ప్రకటన రావడం లేదు. ఆశావహులు మాత్రం పదుల సంఖ్యలో ఉన్నారు. ఎవరికి వారుగా తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. కూటమిలో ప్రధాన భాగస్వామ్యైన తెలుగుదేశం అందుకే గోప్యత పాటిస్తోంది. మరో మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో అందరిలోనూ ఒకటే ఉత్కంఠ నెలకొంది.
* ఈసారి నో ఛాన్స్..
గత రెండుసార్లు బిజెపికి అవకాశం కల్పించింది టిడిపి కూటమి. 2024లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. లోక్సభలో స్పష్టమైన మెజారిటీ ఉంది. కానీ రాజ్యసభలో ఎన్డీఏకు అనుకున్న స్థాయిలో మెజారిటీ లేదు. బిజెపి సొంతంగా అక్కడ ముద్ర చాటాలనుకుంది. గత రెండు సంవత్సరాల్లో ఖాళీ అయిన రాజ్యసభ పదవులను భర్తీ చేయగలిగింది. అలా మిత్రుల కు విజ్ఞప్తి చేసి ఏపీ నుంచి రెండు రాజ్యసభ సీట్లను సొంతం చేసుకుంది. తాజాగా పది రాష్ట్రాల నుంచి 24 మంది రాజ్యసభ సభ్యుల భర్తీ జరగనుంది. అందులో 11 పదవులను బిజెపి సొంతంగానే గెలుచుకొనుంది. దీంతో రాజ్యసభలో సైతం బిజెపి సొంతంగానే మెజారిటీ మార్కు దాటి పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఏపీ నుంచి ఈసారి అవకాశం ఇవ్వలేమని టిడిపి తేల్చి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
