AP local body elections update: స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని.. సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ కూటమి పార్టీల శ్రేణులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా.. దేనికి ఎన్నికలు అన్న సందేహం వ్యక్తం అవుతోంది. అయితే ముందుగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి.. తరువాత మిగతా వాటికి ఎన్నికలు నిర్వహించాలన్నది ఒక ప్రణాళికగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఆలోచన మారినట్లు సమాచారం. రాజకీయంగా పై చేయి సాధించడంతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింతగా కృంగదీసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. అసలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా.. సునాయాస విజయం దక్కాలంటే మున్సిపల్ ఎన్నికలే కీలకమని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ప్రత్యేక అధికారుల నియామకం..
రాష్ట్రంలో వందకు పైగా మున్సిపాలిటీలు ఉన్నాయి. 12 వరకు కార్పొరేషన్లు కొనసాగుతున్నాయి. వాటికి సంబంధించి పాలకవర్గాల పదవీకాలం మార్చి 17 తో ముగిసింది. అప్పటినుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. పంచాయతీలకు సంబంధించిన సర్పంచుల పదవీకాలం ఈనెల రెండు తో ముగిసింది. పంచాయితీలకు కూడా ప్రత్యేక అధికారులు వచ్చారు. మండల పరిషత్ తో పాటు జిల్లా పరిషత్తులకు సంబంధించిన గడువు ఇంకా జూన్ వరకు ఉంది. అది ముగిసిన వెంటనే వాటికి సంబంధించి ప్రత్యేక అధికారుల నియామకం కూడా జరగనుంది. అయితే ఒక్కో స్థానిక సంస్థ ఖాళీ అవుతున్న తరుణంలో ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా ఎన్నికలు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఆ ఒక్క కారణంతో..
ముందుగా మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అని చెబుతోంది. ప్రజల్లోకి బలంగా వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి గెలవాలని చూస్తోంది కూటమి. పట్టణాల్లో విద్యావంతులతో పాటు తటస్థులు అధికం. వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై కొంచెం ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే అక్కడ ఏకపక్షంగా విజయం సాధించవచ్చు అని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. పైగా పార్టీ సింబల్ తో జరిగే ఎన్నికలు కాబట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టణ/ నగర ప్రజలు వ్యతిరేకించే అవకాశం ఉంది. ఈ కారణంతోనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
పార్టీల రహితంగా..
పంచాయితీ ఎన్నికలు అనేవి పార్టీలకు రహితంగా జరుగుతాయి. పైగా మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వము ఉంది. చాలా చోట్ల స్థానిక రాజకీయాలకు అనుగుణంగా అభ్యర్థులు ఎక్కువగా ఉంటారు. ఈ తరుణంలో స్వతంత్రులను సైతం తమ ఖాతాల్లో వేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఆ పార్టీకి ఎంత మాత్రం అవకాశం ఇవ్వకుండా.. ఇప్పుడు నేరుగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లిపోతే బాగుంటుందన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం జన గణన ప్రారంభం అయింది. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ దూకుడు చూస్తుంటే మరి కొద్ది రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.