Andhra Pradesh Local Elections: ఏపీలో( Andhra Pradesh) స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీలతోపాటు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, నగరపాలక సంస్థలకు సంబంధించిన పదవీకాలం ముగిసింది. ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఆరు నెలల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించాలన్నది ఒక నిబంధన. ఇప్పుడు సీఎం చంద్రబాబు తాజా ప్రకటనతో ప్రభుత్వం వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని చూస్తున్నట్లు అర్థం అవుతోంది. స్థానిక సంస్థలకు పాలకవర్గాలు వస్తేనే ఆర్థిక సంఘం నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం వాటి ఎన్నికల నిర్వహణపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు అర్థమవుతోంది.
* రాష్ట్రవ్యాప్తంగా 13 వేలకు పైగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వాటికి సంబంధించి సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2 తో ముగిసింది. దీంతో సర్పంచులు మాజీలు అయ్యారు. వారి స్థానంలో పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది ప్రభుత్వం. అయితే పాలకవర్గాలు లేకపోవడంతో ఆర్థిక సంఘం నిధులకు బ్రేక్ పడే అవకాశం ఉంది. ఇప్పటికే 16వ ఆర్థిక సంఘం సమయం ప్రారంభం అయింది. దాదాపు 15 వేల కోట్ల రూపాయల వరకు ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. పంచాయితీలకు పాలకవర్గాలు ఉంటేనే ఈ నిధులు మంజూరయ్యేవి. అందుకే వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసి 16వ ఆర్థిక సంఘం నిధులతో.. పెద్ద ఎత్తున అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
* రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్ల తో పాటు 123 మున్సిపాలిటీలు/ నగర పంచాయతీలు ఉన్నాయి. వీటికి సంబంధించి పదవీకాలం మార్చి 17 తో ముగిసింది. ప్రస్తుతం ఆర్డీవో స్థాయి అధికారులు ప్రత్యేక అధికారులుగా ఉన్నారు. అయితే పాలకవర్గాలు లేకపోవడంతో పట్టణాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. అందుకే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. వార్డుల విభజనకు సంబంధించిన ప్రక్రియ కూడా జరుగుతోంది.
* ఇక మండల పరిషత్ తో పాటు జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించిన గడువు జూన్ వరకు ఉంది. మండల పరిషత్ అధ్యక్షులతోపాటు జిల్లా పరిషత్ అధ్యక్షుల పదవీకాలం జూన్ తో ముగియనుంది. గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా పరిషత్ కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన బాధ్యత జిల్లా పరిషత్ లది. అందుకే వీటి ఎన్నిక సైతం వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది
* స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అనేక రకాల పిటిషన్లు కోర్టుల్లో దాఖలు అయ్యాయి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అభ్యంతరాలు ఉన్నాయి. అయితే బీసీ గణన తర్వాత రిజర్వేషన్లపై స్పష్టత వస్తుందని ప్రభుత్వం చెప్పింది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం వేసవి తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది.