Heavy Rain Alert To AP: ఏపీకి సూపర్ కూల్ న్యూస్. ఎండలు మండిపోతున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. బంగాళాఖాతం గగనతలంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు వర్షాలు కురవనున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. ఆ సమయంలో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని చెప్పుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర తీరానికి అనుకొని ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది చురుగ్గా కొనసాగుతుండడంతోనే ఏపీలో వర్షాలు కురవనున్నాయి.
సమ్మర్ లో కూల్ కూల్..
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీల కు పైగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వర్ష సూచన రావడం నిజంగా శుభపరిణామం. ఉత్తరాంధ్రతో పాటు చత్తీస్గడ్, తెలంగాణ ఉత్తర ప్రాంతం మీదుగా ఈ ద్రోణి విస్తరిస్తోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఈరోజు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవడం ఖాయమని చెబుతోంది వాతావరణ శాఖ. అయితే ఉరుములతో పాటు మెరుపులు కూడా ఉంటాయని హెచ్చరిస్తోంది. పిడుగులు పడే అవకాశం ఉందని కూడా చెబుతోంది.
ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన..
ఈరోజు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రలో కూడా తేలికపాటి జల్లులు కురుస్తాయి. తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశాలు లేకపోలేదు. రాయలసీమ ప్రాంతంలో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, వ్యవసాయ కార్మికులు చెట్లతో పాటు టవర్ల కింద ఉండవద్దు అని సూచిస్తుంది. బలమైన గాలులు వీయడంతో చెట్లు నేలకొరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది విపత్తుల నిర్వహణ సంస్థ.