Andhra Pradesh MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలు కానుంది. గవర్నర్ కోటాలో వైసీపీకి చెందిన జాకియా ఖానం, పండుల రవీంద్రబాబు మరో నెలలో పదవీ విరమణ చేయనున్నారు. అయితే కేవలం రెండు స్థానాలు కావడంతో వీటిని తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. తర్వాత వచ్చే అవకాశాల్లో మిత్రపక్షాలకు ఛాన్స్ ఇచ్చే పరిస్థితి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీలో చాలామంది ఆశావహులు ఉన్నారు. వారంతా పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. వీర్లో సీట్లు త్యాగం చేసిన వారు ఉన్నారు. అటువంటి వారికి పదవులు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దీంతో చంద్రబాబు మరి ఎలా ముందుకు వెళ్తారు చూడాలి.
* ఆశావాహులు అధికం..
గవర్నర్ కోటాలో నియమితులయ్యే వీరు ఆరేళ్లపాటు పదవీకాలంలో ఉంటారు. అందుకే ఈ ఎమ్మెల్సీలకు విపరీతమైన పోటీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో 10 మంది వరకు ఆశావహులు ఉన్నారు. వంగవీటి రాధాకృష్ణ, దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధ వెంకన్న, పిఠాపురం వర్మ, మహాసేన రాజేష్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలు ఆశావహులుగా ఉన్నారు. వీరికి సర్దుబాటు చేయడం చాలా కష్టం కూడా. అయితే ఇప్పటికే ఎవరికి వారు ప్రయత్నాలు ఉన్నారు. కానీ అన్ని లెక్కలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు ఒక నిర్ణయానికి రానున్నారు.
* సీట్లు త్యాగం చేసినందుకు..
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పిఠాపురం వర్మకు ఎమ్మెల్సీ పదవీ ఇస్తారని ప్రచారం సాగుతోంది. మరోవైపు దేవినేని ఉమామహేశ్వరరావుకు సైతం ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు సీట్లు త్యాగం చేశారు. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటును వదులుకున్నారు వర్మ. అది కచ్చితంగా గెలిచే సీటు. కానీ పవన్ కోరడంతో అసంతృప్తిగానే ఆ సీటును వదులుకున్నారు వర్మ.. అప్పట్లో ఎమ్మెల్సీ హామీ తోనే అలా చేశారు అనేది బహిరంగ రహస్యం. మరోవైపు వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కోసం సీటు వదులుకున్నారు దేవినేని ఉమామహేశ్వరరావు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలకు చంద్రబాబు ఖరారు చేసే అవకాశం ఉందన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
