union budget 2025 (4)
Union Budget 2025: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్( Nirmala sitaraman) ఈరోజు పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కీలక ప్రకటనలు చేశారు. మధ్యతరగతి ఉద్యోగులకు రిలీఫ్ ఇచ్చారు. ఆదాయ పన్ను పరిమితి 12 లక్షలకు పెంచారు. రైతులు, మహిళలు, యువతకు ప్రోత్సాహం ఇచ్చేలా ప్రకటనలు చేశారు. బీహార్ లో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ప్రత్యేక ప్రేమ చూపించారు. ఆ రాష్ట్రానికి భారీగా వరాలు ప్రకటించారు. ఇటువంటి సమయంలో ఏపీకి చేసిన కేటాయింపులపై చర్చ ప్రారంభమైంది. వికసిత్ భారత్ లక్ష్యంగా నిర్ణయాలు ప్రకటించారు నిర్మల సీతారామన్. ప్రధానంగా కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి పెంపు పై నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పరిమితి మూడు లక్షల నుంచి 5 లక్షల రూపాయల పెంపునకు ఆమోదం తెలిపారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే పప్పుధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం బడ్జెట్లో ప్రకటించారు.
* బీహార్ లో ఎన్నికల దృష్ట్యా
బీహార్లో ( Bihar) త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో భారీ వరాలు కురిపించారు. ప్రస్తుతం బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది. బిజెపి, జెడియు ఉమ్మడి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఇటువంటి తరుణంలో బీహార్ కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది కేంద్రం. బీహార్ లోని మఖాన బోర్డు ఏర్పాటుతో పాటు ఐఐటి విస్తరణ పై నిర్మల సీతారామన్ ప్రకటన చేశారు. అక్కడి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం పైన బడ్జెట్ ప్రసంగంలో హామీ ఇచ్చారు. కేవలం బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు స్పష్టం అవుతోంది.
* పోలవరం అంచనా వ్యయం పెంపు
అయితే ఏపీకి( Andhra Pradesh) సంబంధించి పోలవరం విషయాన్ని ప్రస్తావించారు నిర్మలా సీతారామన్. ప్రస్తుత బడ్జెట్లో రూ. 5936 కోట్లను కేటాయించారు. పోలవరం సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు బడ్జెట్లో వెల్లడించారు. పోలవరానికి కేంద్రం కేటాయించిన రూ. 12157 కోట్లను బడ్జెట్లో ప్రస్తావించారు. రూ. 30,436 కోట్లకు ఆమోదం తెలుపుతున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా 41.15 మీటర్ల వరకు నీరు నిలిపేలా నిర్మాణం చేస్తున్నట్లు కేంద్రం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఏపీలో విమానాశ్రయాలు, పోర్టులు, రోడ్లు, రైల్వే కనెక్టివిటీకి అధికంగా కేటాయింపులు చేసినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే ఈ కేటాయింపులపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
* ఏపీ కంటే బీహార్ కే ప్రాధాన్యం
అయితే ఏపీ కంటే బీహార్ కు( Bihar) ఎక్కువ ప్రాధాన్యం తగ్గడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఏపీలో విపక్షాలకు అస్త్రంగా మారుతుంది. ఏపీ నుంచి పెద్ద ఎత్తున ఎన్డీఏ పక్ష ఎంపీలు ఉన్నారు. అదే సమయంలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ సైతం ఏపీకి అత్యంత ప్రాధాన్యం దక్కుతోందని తరచు మాట్లాడుతుంటారు. ఇటువంటి తరుణంలో ఏపీకి బడ్జెట్ కేటాయింపుల్లో ఆశించిన స్థాయిలో జరగలేదని తెలుస్తుండడం.. కచ్చితంగా విపక్షాలకు ఆయుధంగా మారుతుంది. మరి దానిని ఎలా ఎదుర్కొంటారో వారు చూడాలి.