YSRCP Allegations DSC: ఏపీలో డీఎస్సీ 2025 పై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగు చూడడంతో.. ఏపీలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు సంబంధించి అక్రమాలు జరిగాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం ప్రారంభించింది. స్వయంగా అధినేత జగన్మోహన్ రెడ్డి దీనిపై ఆరోపణలు చేశారు. అయితే ఇప్పటికీ ఆ ప్రచారం ఆగడం లేదు. అయితే ఆధారాలు దొరికితే న్యాయపోరాటమైన చేయాలి. అలా చేయడం లేదు సరి కదా ఫేక్ ఐడి లతో సోషల్ మీడియాలో విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులుగా ఎంపికైన 16000 మందికి పైగా ఆందోళనతో గడుపుతున్నారు. కేవలం రాజకీయ ఎత్తుగడలో భాగంగానే డీఎస్సీ ప్రక్రియపై బురద జల్లుతున్నారు అని ఉపాధ్యాయలుగా నియమితులైన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ రాజకీయాల కోసం మమ్మల్ని బలి పశువులు చేయొద్దని కోరుతున్నారు..
* ఏడాది కిందట పూర్తయిన ప్రక్రియ..
ఏడాది కిందట డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీచేసింది. మంత్రి నారా లోకేష్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నోటిఫికేషన్ అడ్డుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. వందలాది పిటిషన్లు కూడా కోర్టుల్లో దాఖలు చేశారు. కానీ పగడ్బందీగా అటు యంత్రాంగం.. ఇటు ప్రభుత్వం వ్యవహరించడంతో సకాలంలో ఈ డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయింది. ఎక్కడికక్కడే ఉపాధ్యాయులు నియామకం కూడా జరిగిపోయింది. ఏడాది పాటు విద్యా బోధన కూడా పూర్తి చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏవో సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం చూసి ప్రెస్ మీట్ పెట్టి ఏకంగా డీఎస్సీ పై బురదజల్లేశారు.
* ఒక్క ఉపాధ్యాయుని నియమించలేదు..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఒక్క డీఎస్సీ నియామక ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు. ఒక్క ఉపాధ్యాయుడిని భర్తీ చేయలేదు. అధికారంలోకి వస్తే ప్రతి ఏటా డీఎస్సీ అని 2019 ఎన్నికలకు ముందు చెప్పారు. దీంతో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. అహోరాత్రులు శ్రమించారు కూడా. కానీ ఒక్క డీఎస్సీ కూడా తీయలేదు. 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నోటిఫికేషన్ అంటూ హడావిడి చేశారు. అది కూడా 6000 ఉపాధ్యాయ పోస్టులతోనే. ఇంతలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం కాకముందే నిలిచిపోయింది. కూటమి వచ్చిన తర్వాత ఆ 6000 పోస్టులకు మరో 10 వేలు పోస్టులను కలుపుతూ మెగా డీఎస్సీ ప్రకటించింది ప్రభుత్వం. నియామక ప్రక్రియను సజావుగా పూర్తిచేసింది.
* ఫేక్ ప్రచారం..
ఇటీవల నీట్ ప్రశ్న పత్రాలు లీకు అయిన సంగతి తెలిసిందే. అదే సమయంలో డీఎస్సీ నియామకాల్లో సైతం అవకతవకలు జరిగాయి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. దానిని రాజకీయంగా మలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి. దానిపై ఆరోపణలు చేసేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వ్యతిరేక ప్రచారం ప్రారంభించింది. దీంతో 16 వేల మందికి పైగా ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనతో గడపాల్సి వస్తోంది. అహోరాత్రులు శ్రమించి ఉపాధ్యాయులుగా ఎంపిక అయితే ఇప్పుడు తమ చుట్టూ రాజకీయం చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వద్ద ఆధారాలు లేవు. అవే ఉంటే న్యాయపోరాటం చేసేది. కానీ ఫేక్ ప్రచారంతో మాత్రం ఉపాధ్యాయులను ఆందోళనలో నెడుతోంది.
