CM YS Jagan : 51 వేల పట్టాలతో ప్రజలంతా జగన్ వైపేనా?

అయితే నాడు 23 గ్రామాల సమస్యే కదా అని ఎద్దేవా చేసిన వారే.. ఇప్పుడు 51 వేల మందికి పట్టాలు అందించేసరికి కృష్ణ, గుంటూరు జిల్లాల్లో సానుకూల వాతావరణం ఏర్పడిందని లెక్కలు కడుతుండడం ఆశ్చర్యం వేస్తోంది.

Written By: Dharma, Updated On : May 26, 2023 2:47 pm
Follow us on

CM YS Jagan : వైసీపీకి అధికారం అమరావతికి శాపం. గత నాలుగేళ్లుగా అమరావతిని ఎంతలా నిర్వీర్యం చేయాలో అంతలా చేసింది. చివరకు అమరావతిని సీనియర్ మంత్రి బొత్సలాంటి వాళ్లు శ్మశానంతో పోల్చారు. అయితే ఇప్పుడు అదే అమరావతిని అడ్డం పెట్టుకొని రాజకీయానికి తెరలేపారు. రాజధాని కోసం ఇచ్చిన భూములను పేదలకు పంచేసి పొలిటికల్ మైలేజీ పొందాలని భావిస్తున్నారు. తద్వారా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని రాజధాని ప్రాంత ప్రజలు వ్యతిరేక భావన నుంచి ప్రభుత్వ అనుకూలురుగా మారిపోయారని ప్రచారం చేయడం ప్రారంభించారు. దానిని తనకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన తరువాత అమరావతి ఉద్యమం పతాక స్థాయికి ఎగసింది. రైతులు ఉద్యమ బాట పట్టారు. తీవ్రస్థాయికి తీసుకెళ్లారు. అమరావతి టు తిరుపతి, అమరావతి టు అరసవల్లి వంటి మహాయాత్రలకు సైతం సిద్ధపడ్డారు. చట్టపరంగా వైసీపీ సర్కారుతో ఢీకొడుతూనే నిరసన కార్యక్రమాలను కొనసాగించారు. ఆ సమయంలో అమరావతి రైతులకు వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు వెలుగుచూశాయి. 23 గ్రామాల సమస్యను.. రాష్ట్ర సమస్యగా మార్చేశారంటూ తిరిగి అమరావతి రైతులపైనే విమర్శల జోరు కురిపించారు. అది అమరావతి కాదు కమ్మరావతి అంటూ కులాలను సైతం అంటగట్టారు.

రాజధాని ఇష్యూలో జగన్ సర్కారును ఏపీలో మెజార్టీ ప్రజలు తప్పుపడుతున్నారు. అయితే ఆ తప్పు దిద్దుకోకపోగా.. ఇప్పుడు రైతుల నుంచి సేకరించిన భూముల్లో ఏకంగా 51 వేల మందికి సెంటు స్థలం చొప్పున జగన్ సర్కారు ఇళ్ల పట్టాలను అందించింది. దీంతో అమరావతి ప్రాంతంలో వైసీపీకి అనుకూల వాతావరణం ఏర్పడిందని ప్రచారం ప్రారంభించారు. అయితే నాడు 23 గ్రామాల సమస్యే కదా అని ఎద్దేవా చేసిన వారే.. ఇప్పుడు 51 వేల మందికి పట్టాలు అందించేసరికి కృష్ణ, గుంటూరు జిల్లాల్లో సానుకూల వాతావరణం ఏర్పడిందని లెక్కలు కడుతుండడం ఆశ్చర్యం వేస్తోంది.

జగన్ సర్కారు మూడు రాజ‌ధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒక ర‌క‌మైన గంద‌ర‌గోళ ప‌రిస్థితి. ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌, కోస్తా ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ధి చేయ‌డం, భ‌విష్య‌త్‌లో వేర్పాటువాద ఉద్య‌మాల‌కు అవ‌కాశం క‌ల్పించ‌కూడ‌ద‌నే త‌లంపుతో మూడు ప్రాంతాల్లో మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేయ‌త‌ల‌పెట్టిన‌ట్టు జ‌గ‌న్ ‌స‌ర్కార్ స్ప‌ష్టం చేసింది. అయితే వ్య‌వ‌హారం కోర్టుకు చేర‌డంతో జ‌గ‌న్ స‌ర్కార్ అనుకున్న‌ది నెర‌వేర‌లేదు.అయితే జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యంతో ముఖ్యంగా అమ‌రావ‌తి ప్రాంతంలో వైసీపీపై తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఇది నిజం కూడా. కానీ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలబెట్టడాన్ని రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. దానిని గ్రహించకపోతే జగన్ సర్కారు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.