IAS IPS Appeal : ఐఏఎస్, ఐపీఎస్‌ల తిరుగుబాటు.. ఏం జరుగనుంది?

ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు డీవోపీటీపై తిరుగుబాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు తాజాగా క్యాట్‌ను ఆశ్రయించారు. డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు.

Written By: Raj Shekar, Updated On : October 15, 2024 3:25 pm

IAS IPS Appeal

Follow us on

IAS IPS Appeal :  ఆంధ్రా క్యాడర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌లను అక్టోబర్‌ 16లోగా రిలీవ్‌ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ క్యాడర్‌ ఐఏఎస్‌లను రిలీవ్‌ చేయాలని ఆంధ్రద్రేశ్‌ ప్రభుత్వాన్ని డీవోపీటీ ఇటీవల ఆదేశించింది. అయితే తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఆంధ్రాకు వెళ్లేందుకు సిద్ధంగా లేరు. ఆంధ్రాలో పనిచేస్తున్న ఐఏఎస్‌లు కూడా అక్కడే ఉండాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అందరూ డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యుల్‌(క్యాట్‌)ను ఆశ్రయించారు. మొత్తం నలుగురు ఏపీ కేడర్‌ ఐఏఎస్‌ అధికారులు వాకాటి కరుణ, వాణీప్రసాద్, అమ్రపాలి, సృజన క్యాట్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని వేర్వేరుగా పిటిషన్‌ వేశారు. ఏపీలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని సృజన కోరారు.

ప్రత్యేష్‌ సిన్హా కమిటీ మేరకు..
రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేష్‌ సిన్హా కమిటీ అధికారుల విభజన చేపట్టింది. 52:48 నిష్పత్రిలో రెండు రాష్ట్రాలకు అధికారులను కేటాయించింది. అయితే కొంతమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వారికి కేటాయించిన రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. ఇలా పనిచేస్తున్నవారిలో కొందరు రిటైర్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో మిగిలిన 11 మంది ఐఏఎస్‌లను సొంత రాష్ట్రానికి కేటాయిస్తూ డీవోపీటీ రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది.

ఏం జరుగనుంది…
ఇక డీవోపీటీ గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం(అక్టోబర్‌ 15న) క్యాట్‌ వీరి పిటిషన్లపై విచారణ జరుపుతుంది. అయితే గతంలోనే క్యాట్‌ సొంత రాష్ట్రాలకు వెళ్లాలని ఆదేశించింది. తాజాగా 11 మంది మరోమారు క్యాట్‌ను ఆశ్రయించిన నేపథ్యంలో తీర్పు ఎలా ఉంటుంది అన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఏపీ ఐఏఎస్‌లు కూడా తెలంగాణకు రావడానికి సుముఖంగా లేదు.