Anil Chandra Punetha: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కొత్త అధికారి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత అధికారి నీలం సాహ్ని ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆమె స్థానంలో కొత్త అధికారి ఎంపిక అనివార్యంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంతా రాష్ట్ర ఎన్నికల అధికారి చూసుకుంటారు. వైసిపి హయాంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారిగా ఉండేవారు. ఆయనను మార్చి ఎన్నికలకు వెళ్లాలని అప్పట్లో వైసీపీ సర్కార్ భావించింది. కానీ అది వీలుపడలేదు. ఎంతో వివాదాస్పదం అయింది. అయితే నిమ్మగడ్డ పదవి విరమణ తర్వాత ఆ స్థానంలో నీలం సాహ్ని ఎన్నికల అధికారి అయ్యారు. ఇప్పుడు ఆమె ఎటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండానే గత నెలలోనే పదవీ విరమణ చేశారు. ఆమె స్థానంలో కొత్త అధికారి ఎంపికకు కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రధానంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పూనెఠా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ నియామకానికి సీఎం చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. త్వరలోనే గవర్నర్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేసి ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం.
* రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా..
2019 ఎన్నికలకు ముందు టిడిపి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు అనిల్ చంద్ర పూనేఠా( Anil Chandra Pune tha ). ప్రస్తుతం ఆయన రిటైర్ అయ్యారు. ఆయననే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు సైతం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే గవర్నర్ ద్వారా నియామక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు సమాచారం. చంద్రబాబు హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనపై 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించింది. ఆ తరువాత ఆయన రిటైర్ అయ్యారు. కూటమి వచ్చిన తర్వాత ఆయనను విజిలెన్స్ కమిషనర్ గా నియమించారు. తాజాగా ఎన్నికల కమిషనర్ గా సేవలను వినియోగించుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నీలం సాహ్ని పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో పూనేఠాకు అవకాశం దక్కనుంది. అదే జరిగితే విజిలెన్స్ కమిషనర్ గా మరో రిటైర్డ్ ఐఏఎస్, మాజీ సిఎస్ నీరబ్ కుమార్ ను నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
* ఏపీలో వివిధ హోదాల్లో..
సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్( Uttrakhand ). ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన రూరల్ డెవలప్మెంట్లో పీజీ చదివారు. ఎల్.ఎల్.బి కూడా పూర్తి చేశారు. 1984 బ్యాచ్ ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్లో చేరారు. కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా కూడా సేవలందించారు. అప్పట్లోనే ఉత్తమ కలెక్టర్గా అవార్డు కూడా అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ శాఖల్లో ఉన్నతాధికారిగా పని చేశారు. 2018లో టిడిపి ప్రభుత్వం ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.