AP job notifications 2026: ఏపీ ప్రభుత్వం( AP government) ఉగాదినాడు ప్రజలకు గుడ్ న్యూస్ లు చెప్పేందుకు నిర్ణయించింది. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు శుభవార్తలు అందించనుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు, వాటి భర్తీ కి సంబంధించి కీలక ప్రకటన చేయనుంది. జాబ్ క్యాలెండర్ ను ప్రకటించనుంది. ఉగాదినాడు ఈ శుభవార్త చెప్పనుంది ప్రభుత్వం. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు సైతం ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రేపే అందుకు సంబంధించి కీలక ప్రకటన ఉండనుంది. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీల వివరాలను వెల్లడించనుంది. దీనిపైనే కసరత్తు జరుగుతోంది యంత్రాంగం. ఆ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఉగాది అనేది నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు రేకెత్తించనుంది.
మంత్రి లోకేష్ ప్రకటన..
ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh). ఆయన విద్యాశాఖ మాత్రమే కాదు. విదేశీ పెట్టుబడులతో పాటు మానవ వనరులు.. ప్రభుత్వ ఉద్యోగాలు.. ప్రైవేటు ఉద్యోగాలు, ఉపాధి కల్పనా వంటి వ్యవహారాలను చూస్తున్నారు నారా లోకేష్. రేపు జాబ్ క్యాలెండర్ ప్రకటనను ఆయనే విడుదల చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎక్స్ ద్వారా విడుదల చేస్తారని తెలుస్తోంది. ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపిన పదివేల పోస్టులతో పాటు మరికొన్ని ఉద్యోగాలతో అధికారులు జాబ్ క్యాలెండర్ను సిద్ధం చేస్తున్నారు. ఇందులో డీఎస్సీ, జూనియర్ లెక్చరర్ పోస్టులు 3000 ఉంటాయి. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి మరో 2600 పోస్టులు ఉంటాయి. బోధనా సిబ్బంది పోస్టులు మరో 1500 వరకు ఉండనున్నాయి. గ్రూప్ 1 లో వందకు పైగా.. గ్రూప్ 2 లో 470 కు పైగా పోస్టులు భర్తీ చేస్తారు. ఇవి రెండూ కలిపి సుమారు 600 వరకు ఉంటాయి. 1000 కానిస్టేబుల్ ఉద్యోగాలు, 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా భర్తీ చేస్తారు. డీఎస్సీ నోటిఫికేషన్ అనేది పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనుంది. మిగతా పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా వేరువేరు నోటిఫికేషన్లు జారీ చేసి పోస్టుల భర్తీ ఉంటుంది. నిర్దేశించిన గడువులో వీటిని భర్తీ చేసేలా అధికారులు క్యాలెండర్ ప్రకటించేలా తుది కసరత్తు జరుగుతుంది.
ఖాళీలు ఇవే..
మొన్ననే డీఎస్సీలో 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. 6 వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టులను కూడా భర్తీ చేశారు. వీటిపై నిరుద్యోగ యువతలో సంతృప్తి కనిపిస్తోంది. అందుకే వెనువెంటనే మరో డీఎస్సీ భర్తీ చేసి.. కానిస్టేబుళ్లను సైతం పెద్ద ఎత్తున నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే మిగిలిన మూడేళ్లలో 7500 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. మరోవైపు ఆర్థిక శాఖ ఆమోదం లభించిన పోస్టుల్లో 470 గ్రూప్ 2 పోస్టులు, 101 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా 1000 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు డిప్యూటీ కలెక్టర్లు 11, డీఎస్పీ సివిల్ 10, డీఎస్పీ జైలు నాలుగు, ఆర్డీవో 3, డిఎల్ఓ 35, కోపరేటివ్ రిజిస్టర్ 17, ఏ ఏ ఓ మూడు, సిటిఓ 10, డీఈఓ 2, డి ఎస్ డబ్ల్యు ఓ నాలుగు, డి టి డబ్ల్యూ ఓ రెండు పోస్టులు ఉన్నాయి. ఈ మొత్తం పోస్టులతో రేపు జాబ్ క్యాలెండర్ విడుదల కానుంది.
