AP Rain Alert: ఏపీ( Andhra Pradesh) కూల్ గా మారింది. భారీ ఎండల నడుమ చల్లటి వాతావరణం కనిపిస్తోంది. ఎండలు దంచి కొడుతున్న క్రమంలో.. చిరుజల్లులు పడుతున్నాయి. బంగాళాఖాతం గగనతలంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర మొదలుకొని రాయలసీమ వరకు వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. మిగతా ప్రాంతాల్లో సైతం వర్షపాతం నమోదయింది. ఈరోజు కూడా అదే పరిస్థితి కొనసాగనుంది. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర తీర ప్రాంతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పై ఉపరితల ఆవర్తన ప్రభావం ఏర్పడింది. ఇది మరింతగా విస్తరించనుంది.
Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా?
* ఈరోజు వర్షాలు పడే జిల్లాలు..
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్ర( North Andhra) నుంచి రాయలసీమ వరకు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కానుంది. ఏపీలో తీర ప్రాంతంలో చల్లటి వాతావరణం నెలకొంది. చల్లని గాలులు వీస్తున్నాయి.
* దాదాపు అన్ని ప్రాంతాల్లో..
మరోవైపు తూర్పుగోదావరి( East Godavari ), పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో చెదురు మదురుగా వర్షాలు పడనున్నాయి. రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడవచ్చని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. చాలా చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అందుకే రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని.. చెట్లు, విద్యుత్ స్తంభాల వద్ద ఉండకూడదు అని సూచిస్తుంది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు ప్రారంభం అయితే క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సూచిస్తోంది.
