AP Heatwave: ఏపీలో( Andhra Pradesh) విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. ఒకవైపు విపరీతమైన ఎండ తీవ్రత ఉంది. మరోవైపు పిడుగులతో కూడిన అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు వర్షాలు.. మరోవైపు ఎండల దెబ్బతో ఏపీ ప్రజలు భిన్న వాతావరణ పరిస్థితులు చవిచూస్తున్నారు. శుక్రవారం రికార్డు స్థాయిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. వేడి గాలుల తీవ్రతతో పాటు ఉక్కపోత కూడా మొదలైంది. ఈరోజు ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేడి గాలులు వీస్తాయి. కోస్తా తో పాటు రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు వానలతో చల్లటి వాతావరణం కొనసాగింది కానీ.. ఒకవైపు ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతున్న ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గడం లేదు.
Also Read: వైభవ్ సూర్య వంశీ.. వరల్డ్ క్రికెట్ సెన్సేషన్ ఊరికే అవలేదు.. దాని వెనుక కన్నీళ్లు పెట్టించే త్యాగం
* ఈరోజు పరిస్థితి ఇలా..
ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో 8 మండలాలు, విజయనగరం జిల్లాలో 20 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 14, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒకటి, పోలవరం జిల్లాలో ఆరు, అనకాపల్లి జిల్లాలో ఐదు, కాకినాడ జిల్లాలో రెండు, తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు, ఏలూరు జిల్లాలో మూడు, ఎన్టీఆర్ జిల్లాలో మూడు మండలాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. 79 మండలాల్లో వడగాలుల తీవ్రత కొనసాగనుంది. ఆదివారం ఏకంగా 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది.
* 45 డిగ్రీలకు చేరువ..
అయితే ఇప్పటి వరకు నమోదు కాని ఉష్ణోగ్రతలు శుక్రవారం నమోదు కావడం విశేషం. కాకినాడ జిల్లా కరపలో ఏకంగా 44.1 డిగ్రీలు, కడపలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో 42.9, తిరుపతి జిల్లా వరదయ్యపాలెం లో 42.8, ఎన్టీఆర్ జిల్లా మొగల్తూరులో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 22 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం. మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖ జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. పిడుగులు కూడా పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. జాగ్రత్తలను సూచిస్తోంది.