Andhra Pradesh Diarrhea Outbreak 2026: ఒకవైపు కల్తీ పాలు.. మరోవైపు డయేరియా.. ఇలా ఏపీలో( Andhra Pradesh) ఏకకాలంలో కలకలం సృష్టిస్తున్నాయి ప్రమాదఘంటికలు. ఏకకాలంలో రెండు ప్రధాన ఆరోగ్య సంక్షోభాలు తలెత్తడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. సీఎం చంద్రబాబు స్వయంగా సమీక్షించి బాధితులకు అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం నగరంలో ఈనెల 23 నుంచి డయేరియా వ్యాప్తి చెందడం ప్రారంభించింది. ఒకరు చనిపోవడంతో పరిస్థితి అదుపు తప్పేలా ఉంది.
* సీఎం అత్యవసర సమీక్ష… శ్రీకాకుళం( Srikakulam ) నగరంలో రోడ్డు మరమ్మతు పనుల్లో భాగంగా పైపులైన్లు ధ్వంసమయ్యాయి. పైప్ లైన్ల ద్వారా కలుషిత నీరు కలవడంతో డయేరియా వ్యాప్తి చెందడం ప్రారంభించింది. విశాఖ నగరంలో శరవేగంగా విస్తరించింది. తొలిత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమీక్షించి చర్యలు ప్రారంభించారు. మంగళవారం రాత్రి సీఎం చంద్రబాబు జిల్లా అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటివరకు 65 మంది డయేరియా బారిన పడినట్లు తెలుస్తోంది. వీరిలో 8 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 55 మంది ఆసుపత్రుల్లో ఉన్నారు. శ్రీకాకుళం కిమ్స్ లో 30 మంది, జి జి హెచ్ లో 11మంది, జేమ్స్ లో ఆరుగురు, అర్బన్ హెల్త్ సెంటర్లలో నలుగురు, మెడికవర్లో ఒకరు , ఇతర ఆసుపత్రుల్లో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. అయితే ఓ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.
* కల్తీ పాలతో నలుగురు..
మరోవైపు రాజమండ్రిలో( Rajahmundry) కల్తీ పాలు ఘటనలో ఇప్పటికే నలుగురు మృతి చెందారు. 15 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 8 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ రెండు ఘటనల్లోనూ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య భద్రతా చర్యలు చేపట్టింది. ప్రజలు శుభ్రమైన నీరు, ఆహారం వాడాలని, లక్షణాలు కనిపించడం వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. ఏకకాలంలో రెండు రకాల ఆరోగ్య సంక్షోభాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా కల్తీ ఘటనలు వెలుగు చూడడం కూడా భయం గొలుపుతోంది.