Vanga geetha viral video: ఇది సోషల్ మీడియా( social media) యుగం. ఏ చిన్న తప్పు జరిగినా.. లోపం జరిగినా.. తప్పిదాలు చోటు చేసుకున్నా ఇట్టే దొరికిపోతాం. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి తప్పిదాలతో తరచూ దొరికిపోతున్నారు అంబటి రాంబాబు. ఆయన విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రయోజనం దక్కుతుందో తెలియదు కానీ.. ప్లస్సులు కంటే మైనస్లే అధికం అని సోషల్ మీడియా మాట. నిన్ననే ఆయన గుంటూరులో నిరాహార దీక్ష చేపట్టారు. కానీ పట్టుమని పదిమంది కూడా ఆ దీక్షా శిబిరానికి హాజరు కాలేదు. దీక్ష చేసిన ప్రాంగణంలో పదిమంది కూడా లేకపోగా.. శిబిరం పై మాత్రం కాపు నేతలతో భారీ బలప్రదర్శనకు దిగారన్న కామెంట్స్ ఉన్నాయి. అయితే బలవంతంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిందని.. సొంత పార్టీ నేతలు కూడా దీనికి ఇష్టపడలేదని ప్రచారం ఉంది. అయితే ఏకంగా ఓ వైసీపీ మహిళా నేత అయితే అంబటి రాంబాబు పేరు గుర్తించలేకపోవడం గమనార్హం. ఆయన దీక్షా శిబిరానికి హాజరై.. ఆయన పేరు ఆమెకు గుర్తుకు లేకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అంశంగా మారింది.
కాపుల టైగర్ గా చిత్రీకరణ..
మొన్న ఆ మధ్యన ఏపీ సీఎం చంద్రబాబును( AP CM Chandrababu) తిట్టి హైలెట్ అయ్యారు అంబటి రాంబాబు. ఆ కేసులో ఆయన చాలా కాలం పాటు రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. అయితే ఆ సమయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంబటి రాంబాబును కాపుల టైగర్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వంగవీటి మోహన్రంగా తో ఆయనను పోల్చారు అంటే ఏ స్థాయిలో ఎలివేట్ చేశారో అర్థం అవుతుంది. అంబటి రాంబాబు ఇంటికి కాపు నేతలు క్యూ కట్టడం.. ముద్రగడ పద్మనాభం లాంటి నేతలు కూడా అంబటి రాంబాబును మహాత్ముడుగా పోల్చడం చూస్తే అప్పట్లో అందరికీ ఆశ్చర్యం వేసింది. అయితే చాలామంది వైసిపి నేతలకు ఇది ఇష్టపడలేదని ప్రచారంలో ఉంది. నిన్న ఆయన నిరాహార దీక్ష చేస్తే పట్టుమని పదిమంది కూడా రాకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
వంగా గీత వింత వైఖరి..
నిన్ననే గుంటూరు వేదికగా నిరాహార దీక్షకు దిగారు అంబటి రాంబాబు( ambati Rambabu). చాలా ఆర్భాటంగా ఏర్పాట్లు చేశారు. కానీ జనం మాత్రం పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. పట్టుమని పదిమంది కూడా ఆ శిబిరానికి హాజరు కాలేదు. పేరు మోసిన కాపు నేతలు కూడా ముఖం చాటేశారు. ఈ తరుణంలో మాజీ ఎంపీ వంగా గీత కార్యక్రమానికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలో అక్కడే అంబటి రాంబాబును పక్కన పెట్టుకొని మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి దీక్ష చేస్తున్నారు అంటూ అంబటి రాంబాబు పేరును చెప్పలేకపోయారు. చివరకు పక్కన ఉన్న నేతలు అంబటి రాంబాబు అని చెప్పడంతో వంగా గీత అప్పుడు ఆయన పేరును సంబోధించారు. అయితే అంబటి రాంబాబు పేరు పలికే క్రమంలో ఆమె ఇతర నేతల ముఖాలను చూస్తూ ఉండిపోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిన్నటి నుంచి అంబటి రాంబాబు దీక్ష శిబిరం సోషల్ మీడియాలో హైలెట్ అవుతుండగా.. ఆ కార్యక్రమానికి వచ్చి మహిళా నేత అంబటి రాంబాబు పేరును మరిచిపోవడం విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది.