YS Jagan Mohan Reddy: అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల విన్యాసాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇప్పుడు అమరావతి రైతుల ద్వారా సరికొత్త గేమ్ ఆడాలని చూస్తున్నారు. కానీ అది వర్కౌట్ అయ్యేలా లేదు. నిన్ననే అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అయితే ఇందులో ఆశ్చర్యం ఉంది. ఎందుకంటే ఇదే అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గళం ఎత్తారు. వారి ఉద్యమాన్ని సైతం ఉక్కు పాదంతో అణచివేయాలని జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు అమరావతి రైతులు వెళ్లడం ఏంటనేది ఇప్పుడు ప్రశ్న. కచ్చితంగా దీని వెనుక రాజకీయం ఉంటుంది అనేది ఒక అనుమానం. కానీ కూటమికి వ్యతిరేకంగా రాజకీయం చేయాలి కాబట్టి కొంతమంది అమరావతి రైతులను తీసుకొచ్చి కూటమి ప్రభుత్వంపై ఒక వ్యతిరేకత తేవాలన్న ప్రయత్నం కనిపిస్తోంది.
* కొద్దిమంది రైతుల విముఖత..
అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల వద్ద నుంచి భూమిని సేకరించింది కూడా. అయితే అతి కొద్ది మంది రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. సిఆర్డిఏ తీరుపై వారు అసంతృప్తితో ఉన్నారు. ఇది తెలుసుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అధినేత జగన్మోహన్ రెడ్డి వద్దకు వస్తే ఈ సమస్యను లేవనెత్తి ప్రభుత్వం పరిష్కారం చేసేలా చూస్తారని నమ్మబలికారు. అయితే వారి ప్రయత్నం కొంతవరకు మాత్రమే వర్కవుట్ అయింది. ఎందుకంటే అలా భూములు ఇవ్వని మెజారిటీ రైతులు అసలు జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఇష్టపడలేదు. రైతులు మరీ తక్కువ రావడంతో వైసీపీ నేతలను రైతు ముసుగు వేసి జగన్మోహన్ రెడ్డి వద్ద కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఏవేవో వారికి హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
* ఆ ఛాన్స్ ఉందా
అసలు అమరావతి వద్దు అన్న జగన్మోహన్ రెడ్డి వద్దకు రైతులు వెళ్తారా? అలా వెళ్ళిన వారు ఏ ప్రలోభాలకు లోనై వెళ్లి ఉంటారో ఇట్టే అర్థం అవుతుంది. ఎందుకంటే అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది.. ఇప్పుడు చేయాలనుకున్నది జగన్మోహన్ రెడ్డి. ఒకవైపు వేలకోట్ల రూపాయలతో అమరావతి రాజధాని నిర్మాణం పనులు జరుపుతుంటే మావిగన్ అని ప్రతిపాదనలు తెచ్చారు. ఇప్పటికీ అమరావతి పై కుట్రలు చేస్తూనే ఉన్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి వద్దకు అమరావతి రైతులు వెళ్లారంటే అది నమ్మశక్యం కాదు. అమరావతిని వ్యతిరేకించడమే కాదు రైతులను పెయిడ్ ఆర్టిస్టులతో పోల్చారు. ఇప్పుడు ఆ పెయిడ్ ఆర్టిస్టులతోనే భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అమరావతి రైతులకు. జగన్మోహన్ రెడ్డి వైఖరి తెలిసిన ఏ అమరావతి రైతు కూడా ఆయనను కలిసేందుకు ఇష్టపడరు. కానీ భూముల సేకరణ విషయంలో ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టిందని భావిస్తున్న వారు సైలెంట్ గా ఉంటారే తప్ప.. జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు మాత్రం ఇష్టపడరు. కానీ అమరావతి రైతులు కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారని చెప్పేందుకు చేసిన ప్రయత్నం గా అర్థం అవుతోంది. అంతకుమించి ఏమీ కనిపించడం లేదు కూడా ఇందులో.
