Amaravati development: అమరావతి రాజధానిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనపై సానుకూల నిర్ణయం ప్రకటించింది. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని ఎంత మాత్రం జాప్యం చేయకూడదని భావిస్తోంది. అందుకే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అత్యున్నత చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం మేరకు ఏపీ పునర్విభజన చట్టం సవరణ బిల్లు 2026 పేరుతో రూపొందించిన కీలక బిల్లును రేపే పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టనుందట కేంద్ర ప్రభుత్వం. దీనిపై కేంద్ర హోం శాఖ ఇప్పటికే లోక్సభ కార్యాలయానికి అధికారికంగా సమాచారం అందించింది. రేపు ఉదయం కేంద్ర కేబినెట్ భేటీలో ప్రవేశపెట్టి.. తక్షణమే ఆమోదం తెలపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
కేంద్రం సీరియస్..
దేశంలోనే ఏపీ రాజధాని విషయంలో ప్రత్యేకంగా పరిగణించాలని ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం సీరియస్ గా తీసుకుంది. చట్టబద్ధత కల్పించేందుకు సమాయత్తం అయ్యింది. రేపు కేంద్ర క్యాబినెట్లో చర్చించడంతోపాటు వెనువెంటనే పార్లమెంట్లో కూడా ఆమోదించేందుకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కీలక సవరణలు చేయడం ద్వారా.. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా.. శాశ్విత ప్రాతిపదికన చట్టబద్ధత చేయడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాం నుంచి రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితికి.. న్యాయపరమైన చిక్కులకు ఈ సవరణతో తెరపడనుంది.
అమరావతి ఇక శాశ్వతం..
ప్రపంచ పటంలోనే అమరావతికి ఇక శాశ్వత స్థానం దక్కనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ఆమోదించిన మరుక్షణం అమరావతి నిర్మాణానికి అందే ఆర్థిక సహాయంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో స్పష్టమైన గ్యారెంటీ లభిస్తుంది. విభజన చట్టంలోని సెక్షన్లను సవరించడం ద్వారా భవిష్యత్తులో రాజకీయ మార్పులు సంభవించిన రాజధాని మార్పు సాధ్యం కాదు. అంటే రాజధానికి సరైన రక్షణ కవచం రానుంది అన్నమాట. ఏపీ ప్రజల చిరకాల స్వప్నమైన రాజధాని నిర్మాణం పై కేంద్రం తీసుకున్న ఈ వేగవంతమైన నిర్ణయం ఎటువంటి వివాదం లేని రాజధానికి మార్గం సుగమం చేయనుంది. అయితే ఈ పరిణామాలు అంతిమంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కలవరం రేపుతున్నాయి. తాము అడ్డగించిన అమరావతి నిర్మాణం పూర్తి చేస్తుండడం కూటమి ప్రభుత్వంపై ఆ పార్టీకి మింగుడు పడడం లేదు.