ABN Channal : మళ్లీ పాజిటివ్ రాతలు.. చంద్రబాబుపై ఏబీఎన్ ఆర్కే మనసు మారిందా? తెరవెనుక ఏం జరిగింది?

ఇటీవల ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ చూసినవాళ్లు షాక్ కు గురై ఉంటారు. ఎందుకంటే సాక్షికి మించి కూటమి ప్రభుత్వంలో తప్పులపై ఆంధ్ర జ్యోతి కధనాల మీద కథనాలను ప్రచురించింది. ఏబీఎన్ ఛానల్ లో ప్రసారం చేసింది. సాధారణంగా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ అనగానే వెంటనే తెలుగుదేశం పార్టీ మౌత్ పీస్ లు గుర్తుకు వస్తాయి. అయితే అలాంటిది ఆ పత్రిక, ఛానల్ ఒక్కసారిగా రూట్ చేంజ్ చేశాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : October 20, 2024 5:09 pm

CM Chandranbabu

Follow us on

ABN Channal :  సత్యవేడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేల మీద సాక్షి కంటే లోతుగా ఆంధ్రజ్యోతి రాతలు రాసింది. ఒకరకంగా ఆంధ్రజ్యోతి రాసిన రాతలను చూసి సాక్షి తల దించుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది. అంతేకాదు ఇసుక పథకంలోనూ ఆంధ్ర జ్యోతి తన మార్క్ స్టోరీలను ప్రజెంట్ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఉచిత ఇసుక పథకంలో బోలెడు తప్పిదాలు ఉన్నాయని.. అసలు ఆ పథకం వల్ల పేదలకు కాకుండా తెలుగు తమ్ముళ్ళకు లాభం జరుగుతోందని రాసుకొచ్చింది. సహజంగానే ఆంధ్ర జ్యోతి ఇలాంటి టర్ను తీసుకోవడం ఒకరకంగా టిడిపి పెద్దలకు ఇబ్బందికరంగా మారింది. అయితే టిడిపి పెద్దలతో గ్యాప్ వల్లే రాధాకృష్ణ ఇలాంటి రాతలు రాస్తున్నారని మీడియాలో ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఆంధ్రజ్యోతిలో గత కొద్దిరోజులుగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రచురితం కావడం.. సాక్షి కంటే ఎక్కువగా ఆంధ్రజ్యోతి వాటిని ప్రచురించడం ఒక విధంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో తెలుగు తమ్ముళ్లు ఆంధ్రజ్యోతి పత్రికను దూరం పెట్టారని ప్రచారం కూడా జరిగింది. అయితే సడన్ గా ఆంధ్రజ్యోతి పేపర్ ఓనర్ వేమూరి రాధాకృష్ణ ఆదివారం రాసిన కొత్త పలుకులో.. ఒక్కసారిగా తన వాయిస్ మార్చారు. ఎప్పటిలాగే జగన్ మీద పడిపోయినప్పటికీ.. ఈసారి చంద్రబాబులో మరో కోణాన్ని చూపించారు.

జగన్ గురించి కొత్త విషయాలు చెప్పకపోయినప్పటికీ.. తనకు తెలిసిన సమాచారాన్ని సో సో గా రాసుకుంటూ వెళ్లిపోయారు. జగన్ మళ్ళీ ప్రతిపక్షంలోనే కూర్చోవడానికి సిద్ధమయ్యారని.. వైసీపీలో అంతర్గతంగా పరిణామాలు జరుగుతున్నాయని.. ఆస్తి పంపకాల విషయంలో జగన్ – షర్మిల మధ్య సయోధ్య కుదరచడానికి విజయలక్ష్మి రంగంలోకి దిగారని రాసుకుంటూ పోయారు. స్థూలంగా చూస్తే అది అతుకుల బొంత లాగా కనిపించింది. రాధాకృష్ణ స్థాయిలో లేదు ఆ వ్యాసం. స్పైసీ లెవెల్స్ పూర్తిగా తగ్గాయి. ఒక రకంగా చప్పిడి వంటకాన్ని రాధాకృష్ణ రూపొందించారు.. ప్రతిపక్షంలో కూర్చోడానికి జగన్ సిద్ధమయ్యారని.. ముఖ్య నేతల సమావేశంలో ఆ విషయం చెప్పారని.. ఆ ముఖ్య నేతల సమావేశానికి శ్యామల వంటి వాళ్లు హాజరయ్యారని.. కీలక నేతలు రాకపోయినప్పటికీ.. ఆ సమావేశం ద్వారా తాను ప్రతిపక్ష స్థానానికి సిద్ధమనే జగన్ ఇచ్చారని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. వాస్తవానికి జగన్కు ప్రతిపక్ష నేత హోదా రాలేదు. ఈసారికైనా వస్తుందో లేదో తెలియదు. ఒకవేళ ఆయనపై ఉన్న కేసుల తీవ్రత దృష్ట్యా జైలుకు ఎప్పుడు వెళ్తారో కూడా తెలియదు. అయినప్పటికీ జగన్ ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటానని ఎందుకన్నారో తెలియదు. అయితే ఆ విషయంపై ఆర్కే కి స్పష్టమైన సమాచారం ఉండటం వల్లే.. దాన్ని నేరుగా చెప్పలేక.. ఇలా డొంకతిరుగుడుగా రాసుకొచ్చారని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జగన్ కు అత్యంత దగ్గరగా ఉండే జర్నలిస్టు దేవులపల్లి అమర్ ను తిట్టుకుంటూ ఈ వ్యాసాన్ని ప్రారంభించిన రాధాకృష్ణ.. జగన్ పరిపాలన వల్ల తమ సంస్థ ఉద్యోగులు పడిన ఇబ్బందులను ఏకరవు పెట్టుకుంటూ వచ్చారు. వ్యాసం ప్రారంభంలో జగన్మోహన్ రెడ్డి నియంత్రుత్వాన్ని భుజానికి ఎత్తుకున్న రాధాకృష్ణ.. ఆ తర్వాత వైఎస్ కుటుంబంలోని ఆస్తుల విభజన వద్దకు వెళ్లారు. అంటే వైయస్ కుటుంబంలో మరో పంచాయతీ మొదలైందని రాధాకృష్ణ కొత్త బాంబు పేల్చారు. అంతేకాదు వైసీపీలో అంతర్గతంగా పరిణామాలు జరుగుతున్నాయని.. ఆ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు ఇతర పార్టీల్లోకి దునకడానికి సిద్ధంగా ఉన్నారని.. చర్చలు కూడా జరుగుతున్నాయని రాధాకృష్ణ అన్నారు. అయితే అలా వెళ్లే నాయకులు ఎవరు? ఎవరు ఏ పార్టీలోకి వెళ్తారు? అనే విషయాలను రాధాకృష్ణ చెప్పలేదు. అయితే మొన్నటిదాకా కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. ఇప్పుడు ఒక్కసారిగా పాజిటివ్ కోణం అందుకోవడం వెనుక.. కారణం ఏమై ఉంటుందనే చర్చ జర్నలిజం సర్కిల్లల్లో జరుగుతోంది.