Andhra Pradesh : ఇది ఆడవాళ్ళ కాలం స్వామి.. ప్రేమించి మోసం చేసిన ప్రియుడి పెళ్లి కెళ్ళి యువతి చేసిన పని వైరల్

రైల్వే కోడూరు ప్రాంతానికి చెందిన సయ్యద్ భాషా.. తిరుపతి ప్రాంతానికి చెందిన ఓ యువతితో 10 సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే కొంతకాలంగా ఆమెకు అతడు దూరంగా ఉంటున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆ యువతి కంగారు పడింది. కొద్దిరోజులుగా అతని కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో రైల్వే కోడూరు కు వచ్చింది. అతడి గురించి ఆరా తీసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 12, 2024 11:36 am

Crime News

Follow us on

Andhra Pradesh : అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నందలూరు ప్రాంతం.. ఆదివారం.. సమయం మధ్యాహ్నం 12:00 గంటలు కావస్తోంది.. ఆ ఇల్లు మొత్తం బంధువులతో సందడిగా మారింది. కాసేపట్లో వధూవరులు వివాహ బంధం ద్వారా ఒక్కటవనున్నారు. అయితే ఇంతలోనే అక్కడికి ఓ యువతి వేగంగా వచ్చింది. చేతిలో ఒక బాటిల్ ఉంది.. వివాహ వేదిక పైన ఉన్న వరుడిని దూషించింది. తన వెంట తెచ్చుకున్న బాటిల్లో ఉన్న ఈ యాసిడ్, కత్తితో ఆ యువకుడి పై దాడికి ప్రయత్నించింది. ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

రైల్వే కోడూరు ప్రాంతానికి చెందిన సయ్యద్ భాషా.. తిరుపతి ప్రాంతానికి చెందిన ఓ యువతితో 10 సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే కొంతకాలంగా ఆమెకు అతడు దూరంగా ఉంటున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆ యువతి కంగారు పడింది. కొద్దిరోజులుగా అతని కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో రైల్వే కోడూరు కు వచ్చింది. అతడి గురించి ఆరా తీసింది. దీంతో ఆమె గుండెలు బద్దలై పోయే విషయం తెలిసింది. అతడికి వివాహం నిశ్చయమైందని, ఆదివారం నందలూరులో వివాహం జరుగుతుందని తెలుసుకుంది. నేరుగా రైల్వే కోడూరు నుంచి నందలూరు వెళ్ళిపోయింది. అక్కడ వివాహం జరుగుతున్న షాదీ ఖానా వద్దకు చేరుకుంది.. వివాహ వేదికపై ఉన్న భాషాను చూసి ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ” 10 సంవత్సరాలు నాతో ఉన్నావు. నన్ను అన్ని రకాలుగా వాడుకున్నావ్. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నావ్. ఇది నీకు న్యాయమేనా” అంటూ బిగ్గరగా అరిచింది. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న యాసిడ్, కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఆ యువతిని బంధువులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ తోపులాటలో భాషా పక్కనే ఉన్న కరిష్మా అనే మహిళ ముఖంపై యాసిడ్ పడింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. దీంతో భాషా ఆగ్రహానికి గురయ్యాడు. కత్తితో తన ప్రియురాలు వీపుపై, భుజంపై తీవ్రంగా పొడిచాడు. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. గాయపడిన కరిష్మా, భాషా ప్రియురాలిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే వారిద్దరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు.

తమకు న్యాయం చేయాలని వధువు తరుపు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో పంచాయతీ కొనసాగుతోంది. మరోవైపు తన ప్రియురాలిపై దాడి చేసిన భాషాపై పోలీసులు కేసు నమోదు చేశారు. పనిలో పనిగా భాషా ప్రియురాలిపై కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ సంఘటన నందలూరు గ్రామంలో సంచలనం కలిగించింది. ఈ ఘటన జరిగిన అనంతరం పెళ్లికూతురు కన్నీటి పర్యంతమైంది. ఇంత జరిగిన తర్వాత తనకు న్యాయం చేయాలని.. తన వైవాహిక జీవితంలో ఇలాంటి గొడవలు ఉండకూడదని ఆమె పోలీసులను బతిమిలాడుతోంది.

తమ కూతురితో పెళ్లి నిశ్చయమైనప్పటికీ.. మరో యువతి తో సంబంధం నడిపిన భాషాపై.. పెళ్లికూతురు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురి జీవితం ఇలా అయిపోయిందేందంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. మరోవైపు భాషా ఇంత జరిగినప్పటికీ ఆ పెళ్లికూతుర్నే వివాహం చేసుకుంటానని పట్టుబడుతున్నాడు. దానికి ఆ యువతి ఒప్పుకోవడం లేదు.