Uttarandhra railway development: ఉత్తరాంధ్ర చరిత్రలో మరో అధ్యాయం ప్రారంభం అయ్యింది. విశాఖ రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈరోజు నుంచి ప్రారంభం అయ్యాయి. విశాఖలోని డెక్ భవనంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ప్రారంభం అయింది. నూతన జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ తో పాటు ఇతర అధికారులు డెక్ భవనంలోకి ప్రవేశించారు. కేంద్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. అనుకున్న మాదిరిగానే ఈరోజు నుంచి రైల్వే జోన్ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇది ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల. ఆపై ఏపీ ప్రజలు కూడా ప్రత్యేక రైల్వే జోన్ కోసం దాదాపు పుష్కర కాలంగా వేచి చూస్తున్నారు. ఇప్పుడు ఆరోజు రానే వచ్చింది.
* విభజన హామీగా..
రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ప్రత్యేక రైల్వే జోన్ కేటాయిస్తామని అప్పట్లో చెప్పారు. కానీ గత పుష్కర కాలంగా జాప్యం జరుగుతూ వచ్చింది. 2018లో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. ఇంతలో అధికార మార్పిడి జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే జోన్ పురోగతి అంతంత మాత్రమే. కనీసం రైల్వే జోన్ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు కూడా కేటాయించలేని స్థితిలో ఉండిపోయింది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జోన్ వేగవంతం అయింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన చేయడమే కాదు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో జోన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ముడసర్లోవలో శాశ్వత భవన నిర్మాణ పనులు జరుగుతుండగా.. విశాఖ నడిబొడ్డున ఉన్న డెక్ భవనంలో జోన్ తాత్కాలిక కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి.
* ఇప్పటివరకు రాష్ట్ర రైల్వే లైన్ భూభాగం ఎక్కువ పరిధి దక్షిణ మధ్య రైల్వే లో ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే కొనసాగేది.
* మరోవైపు భువనేశ్వర్ కేంద్రంగా ఉండే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో కూడా ఉత్తరాంధ్రలో కొంత ప్రాంతం ఉండేది.
* అయితే దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వే జోన్ లో కొనసాగుతున్న విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లను విశాఖ జోన్లో చేర్పించారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా వాల్తేరు డివిజన్ కనుమరుగు అయింది. దాన్ని స్థానంలో విశాఖ రైల్వే డివిజన్ ప్రారంభం అయింది. అది కూడా కొత్త జోన్ పరిధిలో చేర్చారు.
* ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం పరిధిని కూడా విశాఖ రైల్వే జోన్ లో చేర్చారు.
* ఈ జోన్ నెట్వర్క్ 3,532 కిలోమీటర్ల రైల్వే లైన్.. 382 రైల్వే స్టేషన్లు కలిగి ఉంటుంది. 62,000 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తారు. సుమారు 100 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరుగుతుంది. రూ.15,500 కోట్ల వార్షిక టర్నవర్ జరగనుంది. తమిళనాడు తో పాటు కర్ణాటక రాష్ట్రాల పరిధిని కూడా విస్తరించనుంది.
* విశాఖ రైల్వే జోన్ తో ఉత్తరాంధ్రకు కొత్త రూపు రానుంది. కొత్త రైలు సర్వీసులు ఇక్కడి నుంచి ప్రారంభం కానున్నాయి. వస్తు రవాణా కూడా పెరగనుంది. ప్రధానంగా స్థానికంగా పండే వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు మార్గం సుగమం కానుంది.
