Vangaveeti Mohan Ranga: రాజకీయాల్లో కులం అనేది ఒక ప్రధాన ప్రయోగం. కుల భావన లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో లేదు. అయితే రెండు మూడు కులాలే ఆధిపత్యం కనబరుస్తున్నాయి. రాజకీయాలను శాసిస్తున్నాయి. అయితే ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఆవిర్భావం తర్వాత కుల ప్రాధాన్యత ప్రథమ స్థానంలోకి వచ్చింది. కుల ప్రాతిపదికనే వైసీపీ రాజకీయాలు చేస్తూ వస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఆదరిస్తున్న కులాలను కాదని మొన్నటి ఎన్నికల్లో బీసీ ప్రయోగం చేశారు జగన్మోహన్ రెడ్డి. దీంతో అప్పటివరకు ఆ పార్టీని ఆదరించిన సామాజిక వర్గాలు దూరం అయ్యేసరికి దారుణ పరాజయం ఎదురైంది. అయితే ఇప్పుడు మూడు ఎన్నికల్లో కుల ప్రయోగం చేసిన ఆయన నాలుగోసారి ప్రయోగాలకు సిద్ధపడ్డారు కానీ.. గతం మాదిరిగా ఆయన వలలో చిక్కుకునే అవకాశం లేదు. అంతలా అతిగా ప్రవర్తించారు.
అడ్డగోలు సమర్ధన..
వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు( ambati Rambabu) వ్యాఖ్యలను ఎవ్వరూ సమర్ధించరు. అలా సమర్థిస్తే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. సీఎం స్థాయి వ్యక్తిపై వ్యక్తిగత వ్యాఖ్యానాలు చేసి, బూతులు మాట్లాడితే ఎవరికైనా బీపీలు వస్తాయన్న జగన్ మాటలను గుర్తు చేసుకోవాలి. ఆయన ఆడిన మాట కరెక్ట్ అయితే ఇప్పుడు టిడిపి శ్రేణులు చేసింది కూడా కరెక్ట్. కానీ దాడులు అనేవి సహేతుకం కాదు. అయితే ఇంతటి పరిస్థితికి కారణం మాత్రం అంబటి రాంబాబు. ఆయన అరెస్టు జరిగిపోయింది. కోర్టు రిమాండ్ కూడా విధించింది. 14 రోజులపాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉండాల్సిందే.
సీఎం పై హాట్ కామెంట్స్..
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పదవికి గౌరవం ఇవ్వాలి అన్నట్టు ఉంది జగన్( Y S Jagan Mohan Reddy ) పరిస్థితి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద పోలీసులు ఎదుట, మీడియా సాక్షిగా బూతులు తిడుతూ అంబటి వేసిన వీరంగాన్ని.. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేత గా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సమర్థించారు. పార్టీ తనకు అండగా ఉంటుందంటూ.. బూతు రాజకీయాన్ని దగ్గర ఉండి ప్రోత్సహించారు. తనకు అలవాటైన కులముద్ర వేసేందుకు స్క్రిప్టు రెడీ చేశారు. అంబటి ఇంటి పై దాడిని కులముద్రవేసి.. తన పార్టీకి కులరక్ష వేసుకునే పనిలో పడ్డారు జగన్. మూలన ఉన్న ముద్రగడ పద్మనాభం లాంటి వారిని సైతం ఇప్పుడు బయటకు తీసి లేఖలు రాయిస్తున్నారు. ఎమర్జెన్సీ కంటే పరిస్థితి దారుణంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఆ పోలికపై అభ్యంతరాలు..
మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహార శైలి ఎవరికి తెలియంది కాదు. ఆయనను ఇప్పుడు వంగవీటి మోహన్ రంగాతో( vangaveeti Mohan Ranga) పోల్చి చూడడాన్ని ఏమనుకోవాలి? ఇది వైసీపీలో ఉన్న కాపు నేతలకు సైతం నచ్చడం లేదు. వంగవీటి రంగ తో అంబటి రాంబాబును పోల్చి ప్రచారం చేస్తున్నారు. ఇది కాపు వ్యతిరేక చర్య అంటూ గోల చేస్తున్నారు. కాపులంతా ఏకం కావాలి అని పిలుపునిస్తున్నారు. టిడిపి అనచివేతను ఎదుర్కోవాలి అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కమ్మ సామాజిక వర్గంపై కాపు నేతలతో దూషించే పక్కా వ్యూహం అమలు చేస్తున్నట్టు స్పష్టం అవుతుంది. సోషల్ మీడియా పోస్టులతో పాటు సాక్షి మీడియా కథనాలతో రక్తి కట్టించేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ గత అనుభవాల దృష్ట్యా అవి వర్కౌట్ అయ్యే అవకాశం లేదు.