Uttar Pradesh wedding drama : ఎవరైనా పెళ్లిని ఆడంబరంగా జరుపుకుంటారు. జీవితాంతం నిలిచే వేడుక కాబట్టి ఎంతైనా ఖర్చు పెడతారు. విందులు వినోదాల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయరు. ఆభరణాలు.. వస్త్రాలు.. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడంలో తమ తాహతు మించి చేస్తారు. ఇతడు కూడా అలానే చేశాడు. అంతకుమించి అనే స్థాయిలో ఖర్చు పెట్టాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అతడి జీవితం సినిమా మాదిరిగా రకరకాల మలుపులు తీసుకుంది. చివరికి కన్నీటిని మిగిల్చింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిత్రి ప్రాంతంలో షాజహాన్పూర్ బరేలి మార్గంలో ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి వేడుక అంబరాన్ని తాకే విధంగా సాగుతోంది.. బంధువులు సందడి చేస్తున్నారు. వధువు తరఫున వారు.. వరుడి తరఫున వారు కుశల ప్రశ్నలు అడుక్కుంటున్నారు.. వరుడు అందంగా ముస్తాబయ్యాడు.. రాజకుమారుడిలాగా కళ్యాణమండపం వద్దకు వచ్చాడు. పెళ్లి కుమార్తె రావాల్సి ఉంది. కానీ ఇంతలోనే చెడు వార్త. బంగారు ఆభరణాలతో.. ఆమె అంతకు ముందు రాత్రే తన ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ విషయం వధువు తరుపు బంధువులు వరుడి తరఫు వారికి చెప్పలేదు. పైగా వధువు తరఫు వారు ఆమె చెల్లిని పెళ్లి మండపం మీద కూర్చోబెట్టారు. అక్క వెళ్లిపోయింది కాబట్టి.. నువ్వు అతనిని పెళ్లి చేసుకోవాలని ఆమెను ఒప్పించారు.
పెళ్లి వేదిక మీద తనకు కాబోయే భార్య కాకుండా.. ఆమె చెల్లి ఉండడంతో పెళ్ళికొడుకు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత తాను ఈ పెళ్లి చేసుకోనని మొండికేశాడు. ఆ తర్వాత అతడిని ఒప్పించి పెళ్లికి సిద్ధం చేశారు. అంత బాగుంటుందనుకుంటున్న క్రమంలో ఒక వ్యక్తి వచ్చాడు. అతడు మరెవరో కాదు.. ఆ అమ్మాయి ప్రేమికుడు. మళ్లీ లొల్లి మొదలైంది. ఈసారి భౌతిక ఘర్షణల దాకా వెళ్ళింది. వధువు తరఫున వాళ్లు గాల్లోకి కాల్పులు కూడా జరిపినట్టు తెలుస్తోంది. ఈ గొడవలో కొంతమంది గాయపడ్డారు. ఒకరి పరిస్థితి దారుణంగా ఉంది. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కేసులు నమోదు చేయకపోయినప్పటికీ.. ఇరు వర్గాల వారికి క్లాస్ పీకినట్టు తెలుస్తోంది.
పెళ్లిని గొప్పగా చేసుకోవాలని అతడు అన్ని రకాలుగా ఖర్చులు పెట్టుకున్నాడు. బంధువులందరికీ కార్డులు ఇచ్చాడు. వారు మెచ్చే విధంగా విందు భోజనం తయారు చేయించాడు. తీరా మరి కాసేపట్లో పెళ్లి అనగా ఇలాంటి ఘటన జరగడంతో అతడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. తనకు పెళ్లి యోగం లేదేమో అనుకుంటూ మదన పడిపోతున్నాడు.
