Mojtaba Khamenei: అమెరికా – ఇరాన్ యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాలుస్తోంది. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇంకోవైపు అమెరికా ఆత్మరక్షణ పేరుతో దాడులు చేస్తోంది. దీంతో ఇరాన్ కూడా ప్రతిదాడుల ప్రారంభించింది. అమెరికా అనుకూల గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులు ప్రారంభించింది. దీంతో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హర్మూజ్ మూసివేతతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. తాజా ఉద్రిక్తతలో ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపనున్నాయి. ఇక అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మళ్లీ యాక్టివ్ అవుతున్నట్లు తెలుస్తోంది.
అమెరికా విదేశాంగ మంత్రి ప్రకటన..
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇరాన్ సుప్రీం లీడర్ విషయంలో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ బతికి ఉన్నారని, మరింత యాక్టివ్గా ఉన్నారని అమెరికా అధికారికంగా సంకేతాలు ఇచ్చారు. ఇరాన్–అమెరికా సంబంధాల్లో కొత్త మలుపును సూచిస్తోంది.ç రూబియో సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ముందు చేసిన వ్యాఖ్యలు ప్రకారం, మొజ్తబా ఖమేనీ ఇటీవలి కాలంలో దేశ వ్యవహారాల్లో మరింత లోతుగా పాల్గొంటున్నారని సూచనలు ఉన్నాయి. ఆయన కమ్యూనికేషన్లు రాతపూర్వకంగా, మధ్యవర్తుల ద్వారా జరుగుతున్నప్పటికీ, ఇరాన్ వ్యవస్థలో ఆయన ప్రభావం పెరుగుతోందని అమెరికా అంచనా వేసింది. ఇది ఇరాన్లో ఇటీవలి రాజకీయ అస్థిరతను పరోక్షంగా ధ్రువీకరిస్తోంది. సుప్రీం లీడర్ స్థానం ఇరాన్ వ్యవస్థలో కీలకమైనది కాబట్టి, ఆయన కార్యకలాపాలు పునరుద్ధరణకు సంకేతం కావచ్చు. ఇది ఇరాన్ లోపలి శక్తుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
హార్ముజ్ జలసంధి సమస్య..
ఇరాన్ హార్ముజ్ జలసంధిలో చేస్తున్న చర్యలను అమెరికా చట్టవిరుద్ధమని అభివర్ణించింది. ప్రపంచ ఆయిల్ మరియు ఎల్ఎన్జీ సరఫరాలో 20 శాతం ఈ జలసంధి ద్వారా వెళ్తుంది. దీనిని తిరిగి తెరవాలని అమెరికా స్పష్టమైన డిమాండ్ చేసింది. ఈ సమస్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతోంది. జలసంధి మూసుకుపోవడం వల్ల ఆయిల్ ధరలు పెరగడం, గ్లోబల్ సప్లై చైన్ అంతరాయాలు ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తాయి. అమెరికా ఈ అంశాన్ని డిప్లమసీలో ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రాంతీయ స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.
అణు కార్యక్రమంపై చర్చలు..
ఇరాన్ తన అణు కార్యక్రమాలతో సంబంధించిన అంశాలను చర్చించడానికి అంగీకరించిందని రూబియో తెలిపారు. ఇది గతంలో ఇరాన్ తీసుకున్న వైఖరికి భిన్నంగా ఉంది. యుద్ధం తర్వాత ఇరాన్ ఆర్థికంగా, సైనికంగా ఒత్తిడిలో ఉండటంతో డిప్లమసీ వైపు మొగ్గుచూపుతోందని విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఇది పూర్తి ఒప్పందం కాదు. చర్చలు ఎంతవరకు ముందుకు వెళ్తాయి, ఇరాన్ ఎంతవరకు రాజీపడుతుంది అనేది కీలకం. అమెరికా వైపు నుంచి ఆంక్షల సడలింపు అణు కార్యక్రమం మీద ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ పరిణామాలు మధ్యప్రాచ్య ప్రాంతంలో స్థిరత్వం, అస్థిరత్వం రెండింటికీ మార్గం సుగమం చేస్తాయి. మొజ్తబా ఖమేనీ యాక్టివ్ అవడం ఇరాన్ లోపలి నిర్ణయాధికారాన్ని బలోపేతం చేయవచ్చు.
హార్ముజ్ జలసంధి తెరవడం గ్లోబల్ ఆయిల్ మార్కెట్లను స్థిరపరచవచ్చు.
అణు చర్చలు ముందుకు వెళితే దీర్ఘకాలిక ఉద్రిక్తతలు తగ్గవచ్చు.
